పిల్లలు చదువుపై శ్రద్ధ చూపడం లేదా..? పేరెంట్స్ గమనించాల్సిన విషయాలివే..

by Javid Pasha |   (  Updated:2025-07-25 12:26:00  IST  )

పిల్లలు చదువుపై శ్రద్ధ చూపడం లేదా..? పేరెంట్స్ గమనించాల్సిన విషయాలివే..

పిల్లలు చదువుపై శ్రద్ధ చూపడం లేదా..? పేరెంట్స్ గమనించాల్సిన విషయాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పిల్లలు డల్‌గా మారిపోయారా? చదువుపై ఆసక్తి చూపడం లేదా? ఏకాగ్రత తగ్గిందా? బద్దకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే పేరెంట్స్ ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కాల్షియం లోపంవల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

*పిల్లలు ఆరుబయట ఆడుకోవడానికి ఆసక్తి చూపడం లేదంటే.. వారిలో కాల్షియం లోపం కూడా ఉండవచ్చు. దీనివల్ల బలహీనత ఆవహించి అలా చేస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, జలదరిపు, నొప్పి, చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి కూడా కాల్షియం లోపం ఉందనడానికి సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో తగినంత ఆహారం తీసుకోకపోవడంవల్ల కూడా పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు.

*దంతాలు, చిగుళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు కానీ.. కొంతమంది పేరెంట్స్‌కు చెప్పరు. ఏదో చిన్న సమస్య అనుకుంటారు. దీనివల్ల తిండి సరిగ్గా తినరు. క్రమంగా ఎముకలు, దంతాలు బలహీన పడే అవకాశం ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపవంవల్లే ఇలా జరుగుతుంది. అలాగే నోటి పరిశుభ్రత పాటించకుంటే కూడా ‘పీరియంటల్ డిసీస్’ అనే చిగుళ్ల వ్యాధి రావచ్చు.

*సహజంగానే ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఎదురు చూస్తుంటారు పిల్లలు. కానీ అర్ధరాత్రిళ్లు కూడా వారు మేల్కొంటున్నారంటే అనుమానించాల్సిందే. కాల్షియం లోపంవల్ల కూడా ఇలా జరుగుతుంది. దీంతో నీరసంగా, బలహీనంగా మారుతారు. బద్ధకం, అలసట వేధిస్తాయి. నిద్రలేమిని ఎదుర్కొంటుంటారు.

* చేతులు, చేతి గోళ్లు ఎల్లో కలర్‌లో మారిపోతే అది కాల్షియం లోపం లక్షణాలేనని నిపుణులు అంటున్నారు. దీంతో పిల్లల గోళ్లు బలహీనంగా మారడం, పాలిపోవడం, ముక్కలుగా విరుగుతూ రాలిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, దురద వంటివి కూడా పిల్లల్లో కాల్షియం లోపంవల్ల తలెత్తే సమస్యలుగా ఉంటాయి.

*చదువుపై ఏకాగ్రత కుదరకపోవడం, చదివినా గుర్తుండకపోవడం, కొద్దిసేపు కూర్చోగానే అలసి పోవడం వంటి లక్షణాలు కూడా పిల్లల్లో కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ‘హైపోకాల్సెమియా’ వ్యాధిగా మారుతుంది. ఇది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, భ్రమలకు లోనవడం, మతిమరుపు, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే కాల్షియం లోపాన్ని అధిగమించాలి. అందుకోసం పాలు, పెరుగు, ఆకూ కూరలు, బాదం, జీడిపప్పులు, పిస్తా, గుమ్మడి గింజలు, రాగులు, కొమ్ము శనగలు, చేపలు, బీన్స్, వేరు శనగలు వంటివి ఆహారంలో భాగంగా చేర్చి పిల్లలకు ఇవ్వాలంటున్నారు నిపుణులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story