ఆ ఊరు.. కలెక్టర్ల కార్ఖానా.!

by Daayi Srishailam |

మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లనందించి "ఐఏఎస్ ఫ్యాక్టరీ"గా పేరుపొందింది ఆ ఊరు.

ఆ ఊరు.. కలెక్టర్ల కార్ఖానా.!
X

దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి అనే చిన్న గ్రామంలో కేవలం 75 ఇండ్లుంటాయి. కానీ ఆ ఊర్లో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుంటారు. మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లనందించి "ఐఏఎస్ ఫ్యాక్టరీ"గా పేరుపొందింది ఆ ఊరు.

వివిధ రంగాల్లో

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయం సాధించడం అంత ఈజీ కాదు. సంవత్సరాల కఠిన శ్రమ, అంకితభావం అవసరం. అయినప్పటికీ ఈ మాధోపట్టి గ్రామం ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకుండానే దీన్ని సుసాధ్యం చేసింది. కేవలం సివిల్ సర్వీస్ అధికారులే కాదు.. అంతరిక్ష పరిశోధన, అణు పరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఉన్నారు. వినయ్ కుమార్ సింగ్, చత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అన్నదమ్ములు. ఈ నలుగురూ ఐఏఎస్‌లే. వినయ్ కుమార్ సింగ్ బీహార్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తే చత్రపాల్ సింగ్ తమిళనాడు సీఎస్‌గా సేవలందించాడు.

అప్పట్నుంచి ఆగకుండా

1917లో స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్ గ్రామంలో విద్యను ప్రారంభించడంతో ఈ ట్రెండ్ మొదలైంది. శ్యామరతి మొదట బాలికలకు విద్యను అందించడం ప్రారంభించారు. తర్వాత బాలురు కూడా ఈ విద్యా కార్యక్రమంలో చేరారు. ఇది గ్రామంలో విద్యా సంస్కృతిని నాటింది. ఇది తరాల పాటు కొనసాగింది. గ్రామం నుంచి మొదటి సివిల్ సర్వీస్ అధికారి 1914లో ఖాన్ బహదూర్ సయ్యద్ ముస్తఫా. ఆ తర్వాత 1952లో ఇందు ప్రకాశ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అప్పట్నుంచి ఈ గ్రామం నుంచి విజయాలు ఆగలేదు.

కోచింగ్ లేకుండానే..

మాధోపట్టి గ్రామం అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇక్కడ ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకపోవడం. సాధారణంగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లు ప్రముఖ కోచింగ్ సంస్థలపై ఆధారపడతారు. కానీ మాధోపట్టిలోని యువత శ్రద్ధ, కఠిన శ్రమ, స్వీయ-అధ్యయనంతో మాత్రమే ఈ విజయాలను సాధించారు. గ్రామంలోని యువతకు ప్రేరణగా నిలిచిన అధికారులు తమ విజయ గాథలతో తరువాతి తరాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా జౌన్‌పూర్‌లోని తిలక్ ధారి సింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కాలేజీ ఈ గ్రామ యువత విజయంలో కీలక పాత్ర పోషించింది.

స్త్రీ సాధికారత

ఈ అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ మాధోపట్టి గ్రామం ప్రాథమిక సౌకర్యాల కొరతతో సతమతమవుతోంది. రోడ్లు గుంతలతో నిండి ఉన్నాయి. విద్యుత్ సరఫరా అస్థిరంగా ఉంది. వైద్య సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు తమ లక్ష్యాలను సాధించడం వారి అసమాన సంకల్పాన్ని చాటుతుంది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు. కొడుకులు, కూతుర్లే కాదు.. కోడళ్లు కూడా సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత స్థానాలను అధిష్టించారు. ఈ విజయం గ్రామంలో విద్య, సాధికారత పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తుంది.

Next Story