- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెస్టారెంట్లో డిన్నర్ చేస్తుండగా వచ్చిన ఐడియా.. కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది
ఈ స్టార్టప్ 20000 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసి కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతోంది

దిశ, ఫీచర్స్: వ్యర్థంగా పరిగణించే వస్తువులను లాభదాయక వనరుగా మార్చిన ఒక స్టార్టప్ కథ ఇది. అనూజ్ భట్నాగర్, ఉదయ్భాన్ సింగ్, అమిత్ గౌతమ్ అనే ముగ్గురు స్నేహితుల ఆలోచన నుంచి పుట్టిన 'లెట్స్ స్క్రాప్' స్టార్టప్.. ఇప్పుడు వ్యర్థాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది. ఈ స్టార్టప్ 20000 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసి కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతోంది.
సంస్కరణలు అవసరం..
అనూజ్ భట్నాగర్ ఒకరోజు వ్యర్థ నిర్వహణ గురించి చర్చించే సమావేశంలో పాల్గొన్నాడు. డీటీహెచ్ బాక్సులు, వై-ఫై రూటర్ల వంటి గృహ వస్తువులు వాడుకలో లేనప్పుడు వాటిని బాధ్యతాయుతంగా తొలగించాలనే సరళమైన అంశం చర్చకు వచ్చింది. కానీ ఈ పని అనుకున్నంత సులభం కాదని అనూజ్ గుర్తించాడు. వ్యర్థ నిర్వహణ పరిశ్రమలో అస్తవ్యస్తత, విక్రేతల మధ్య పోటీ లేకపోవడం, పాత పద్ధతులు, పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలుంటాయని తెలుసుకున్నాడు. వారాంతాల్లో దుకాణదారులు, రీసైక్లర్లతో మాట్లాడి మార్కెట్ డైనమిక్స్ను అర్థం చేసుకున్నాడు. సంస్కరణలు అవసరమని గ్రహించాడు.
డిన్నర్ టైం ఆలోచన..
ఈ సమస్యల గురించి అనూజ్ తనస్నేహితులైన ఉదయ్భాన్ సింగ్, అమిత్ గౌతమ్లతో తరచూ చర్చించేవాడు. ఒక రోజు రెస్టారెంట్లో డిన్నర్ సమయంలో అమిత్ ఈ సమస్యను ఒక అవకాశంగా మార్చి సాంకేతికతను ఉపయోగించి వ్యర్థ నిర్వహణలో మార్పు తెచ్చే వ్యాపారం ప్రారంభించాలని సూచించాడు. ఆ క్షణంలోనే ‘లెట్స్ స్క్రాప్’ జన్మించింది వ్యర్థ నిర్వహణలో సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. లెట్స్ స్క్రాప్.. కార్పొరేట్ సంస్థలు, గృహాల కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది. ఇది వ్యర్థ సేకరణ, డాక్యుమెంటేషన్, రీసైక్లింగ్ ప్రక్రియలను సులభతరం చేస్తుంది.
వ్యర్థ సేకరణ..
ఈ-కామర్స్, ఎఫ్ఎమ్సీజీ కంపెనీల వంటి బహుళ దుకాణాలు కలిగిన సంస్థలు ఈ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి వ్యర్థ సేకరణను షెడ్యూల్ చేస్తాయి. ప్రతి దుకాణం ఒక సేకరణ కేంద్రంగా రిజిస్టర్ అవుతుంది. లెట్స్ స్క్రాప్ ఏజెంట్లు యాప్ ద్వారా వ్యర్థ వస్తువుల ఫోటోలు తీసి, వివరాలను డిజిటల్గా రికార్డ్ చేస్తారు. డిజిటల్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. సేకరించిన వ్యర్థం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎమ్ఆర్ఎఫ్)కి తీసుకెళ్లబడుతుంది. అక్కడ అది కాగితం, ప్లాస్టిక్, లోహం, ఈ-వేస్ట్ వంటి వర్గాలుగా విభజించబడుతుంది. ఈ వ్యర్థం అధీకృత రీసైక్లర్లకు విక్రయించబడుతుంది.
12 నగరాల్లో..
లెట్స్ స్క్రాప్ వ్యర్థ సేకరణ కోసం కంపెనీల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయదు. బదులుగా సేకరించిన వ్యర్థానికి కంపెనీలకు చెల్లిస్తుంది. రీసైక్లర్లకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతుంది. ఈ వ్యాపార నమూనా క్లయింట్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది.కొన్ని కంపెనీలకు వ్యర్థ ఆదాయం వారి దుకాణ అద్దె ఖర్చులలో 20-25 శాతం వరకు భర్తీ చేస్తుంది. 2023లో ప్రారంభమైన లెట్స్ స్క్రాప్ ఇప్పటివరకు 20,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని నిర్వహించింది. 200 కంటే ఎక్కువ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఢిల్లీ, చెన్నయ్ వంటి 12 నగరాల్లో సేవలు అందిస్తోంది.






