దొంగలు, రౌడీలు నడిపే హోటల్.. మర్యాదలు మామూలుగా ఉండవు మరి..!?

by Bhoopathi Nagaiah |

సహజంగా రౌడీలన్నా, దొంగలన్నా ప్రజలు భయపడుతుంటారు.

దొంగలు, రౌడీలు నడిపే హోటల్.. మర్యాదలు మామూలుగా ఉండవు మరి..!?
X

దిశ, వెబ్‌డెస్క్: సహజంగా రౌడీలన్నా, దొంగలన్నా ప్రజలు భయపడుతుంటారు. మర్డరో, మానభంగమో చేసి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లంటే ఇంకా భయపడుతారు. వాళ్లవైపు కూడా వెళ్లరు. కానీ వివిధ నేరాలు చేసి పోలీస్ కేసుల పాలైన వాళ్లే మీకు అతిథి మర్యాదలు చేస్తే.. పక్కన్నే ఉండి ఇది తిను.. అది తిను అంటూ కొసరి కొసరి వడ్డిస్తే.. ఊహించుకోవడానికో.., సినిమాల్లో చూడటానికో బాగుంటుంది కానీ నిజ జీవితంలో జరగదని అనుకుంటారు కదా.. కానీ గోదావరి జిల్లాల వారిని మైమరిపించేలా అతిథి మర్యాదలతో మీకు కడుపు నిండా తిండి పెట్టే ఓ హోటల్ ఉందని మీకు తెలుసా..? అక్కడ అందరూ దొంగలు, రౌడీలు, మర్డర్లు చేసిన వాళ్లే మీకు వండి, వడ్డిస్తారని తెలుసా..? వినడానికి ఆశ్చర్యం వేసిన ఇది నిజమే.

మహారాష్ట్రలోని పూణే జిల్లా ఎరవాడ జైలు ఖైదీలు హోటల్ తెరిచారు. ఈ హోటల్ ఐడియాకు నాంది పలికింది మాత్రం ఆ జైలు అధికారి అమితాబ్ గుప్తా. జైలులో మంచి రుచికరమైన వంటకాలు చేసే ఖైదీలు ఉన్నారని గుర్తించిన ఆయన వారితో హోటల్ పెట్టాలని భావించారు. జైలులో సత్‌ప్రవర్తన కలిగిన 24 మంది ఖైదీలను గుర్తించి వారిని ఓ టీంగా ఏర్పాటు చేశారు. వారితో ‘శృంఖల ఉపహార్ గృహ్’ పేరుతో హోటల్‌ను ఓపెన్ చేశారు. ఆ 24 మంది ఖైదీలే రెండు షిఫ్టుల్లో అల్పాహారాన్ని తయారు చేస్తూ విక్రయాలు చేపడుతున్నారు. కస్టమర్లతో మర్యాదగా మెలుగుతూ రుచికరమైన టిఫిన్స్ అందిస్తుండటంతో ఆ హోటల్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అక్కడ పాత్రలు తోమడం నుంచి వంటలు వడ్డించడం, కౌంటర్ చెల్లింపుల వరకు ఖైదీలే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ‘శృంఖల ఉపహార్ గృహ్’కు ఆధరణ పెరగడంతో జైలు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీల ప్రతిభను ప్రోత్సహించడానికే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించానని జైలు అధికారి అమితాబ్ గుప్తా ఆనందంగా చెబుతున్నారు.

Next Story