పాఠశాలలో వ్యవసాయం చేస్తున్న 78వేల మంది పిల్లలు

by Sujitha Rachapalli |

చిన్న కొడుకుకు కూరగాయలను తినడం అలవాటు చేయాలనే ఉద్దేశం ఆ తల్లిలో గొప్ప ఆలోచనకు దారితీసింది. 78వేల మంది స్కూల్ పిల్లలు తమ ఆహారాన్ని పాఠశాలలోనే పెంచుకునేందుకు కారణమైంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాఠశాలలో వ్యవసాయం చేస్తున్న 78వేల మంది పిల్లలు
X

దిశ, ఫీచర్స్ : చిన్న కొడుకుకు కూరగాయలను తినడం అలవాటు చేయాలనే ఉద్దేశం ఆ తల్లిలో గొప్ప ఆలోచనకు దారితీసింది. 78వేల మంది స్కూల్ పిల్లలు తమ ఆహారాన్ని పాఠశాలలోనే పెంచుకునేందుకు కారణమైంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అనుభవం నేర్పిన పాఠం

ఢిల్లీకి చెందిన మాజీ యాడ్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ ప్రగతి చస్వాల్ 2017లో సోగుడ్ ఫౌండేషన్‌ను స్థాపించింది. చిన్న కొడుకు కూరగాయలు తినేలా చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోనే కూరగాయలు పండించడం మొదలుపెట్టింది. కానీ ఈ అనుభవం అంతకంటే ఎక్కువగానే నేర్పింది. ఆ బాలుడు మట్టితో అనుసంధానం అయ్యాడు. మొక్కలు ఎలా పెరుగుతాయో గమనించాడు. ఉష్ణోగ్రత మార్పులను గ్రహించాడు. మొక్కలకు సంరక్షణ అవసరమని అర్థం చేసుకున్నాడు. పుస్తకాలు ఎప్పటికీ నేర్పలేని ప్రపంచాన్ని ఆస్వాదించాడు. ఈ చిన్న ప్రయోగమే పాఠశాలల్లో హ్యాండ్స్-ఆన్ అర్బన్ ఫార్మింగ్(పట్టణ వ్యవసాయం) తీసుకురావాలనే ఆలోచనకు పునాది వేసింది. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను అభివృద్ధి చేసి.. ప్రభుత్వ పాఠ్యాంశాలతో భాగస్వామ్యం చేసుకున్నారు.

ఇదే ప్రధాన లక్ష్యం

పిల్లలను ప్రకృతితో అనుసంధానం చేసి.. తమ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకునేలా చేయడం.. స్థిరత్వం (సస్టైనబిలిటీ), పర్యావరణ సంరక్షణ అలవాట్లు ఏర్పరచడం ప్రగతి ప్రధాన లక్ష్యం. పాఠాలు చెప్పడం కంటే అనుభవాత్మకంగా నేర్పించడంపై ఫోకస్ చేశారు. కరోనా సమయంలో కూడా ఆన్‌లైన్ మాడ్యూల్స్ ద్వారా ప్రకృతితో సంబంధం కొనసాగించారు. ఇప్పటివరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లో 28 పాఠశాలలకు చెందిన 78 వేల మంది పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు.

ఏం నేర్చుకుంటారు?

మైక్రోగ్రీన్స్, పాలకూర, చొలై (అమరాంత్), మెంతులు, బీన్స్, మలబార్ స్పినాచ్, వాటర్ స్పినాచ్, ఘియా వంటివి పెంచుతారు విద్యార్థులు. పైకప్పులు, గోడలు (రీసైకిల్ బాటిళ్లతో వర్టికల్ గార్డెన్స్), కాంక్రీట్ ప్రాంగణాలు (పాత టైర్లతో), కారిడార్లు, కిటికీల వంటి వాటిని వీటిని పెంచేందుకు ఉపయోగిస్తారు. పిల్లలే స్వయంగా నీళ్లు పోయడం, కలుపు తీయడం, కంపోస్టింగ్, వ్యర్థాల విభజన, తెగులు నియంత్రణ వంటివి చూసుకుంటారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు మార్గదర్శకత్వంగా ఉంటారు. షిఫ్ట్‌ల ద్వారా బాధ్యతలను పంచుకుంటారు. మొక్కల జీవన చక్రం, మట్టి రకాలు, వాతావరణ మార్పుల వంటి సామాన్య శాస్త్రానికి సంబంధించిన అంశాలను ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ప్లాట్లు కొలవడం, దిగుబడి లెక్కల వంటివి చూసుకోవడం మ్యాథ్స్‌లో ఇంట్రెస్ట్‌ను పెంచుతుంది. ఇక పిల్లలు పంట కోసి ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులతో కలిసి వంటకాలు చేసుకుని తినడం చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్తుంటారు ప్రగతి. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపిస్తే [email protected] (mailto:[email protected])కు ఈమెయిల్ చేయవచ్చు. sowgood.org.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Next Story