కొలిమి సెగలోంచి.. కొత్త జీవితం.!

by Daayi Srishailam |
కొలిమి సెగలోంచి.. కొత్త జీవితం.!
X

నిత్యం సలసలకాగే ఇనుముతో పనీ.

మలమల మసిలే కొలిమితో ప్రయాణం.

సుత్తెతో ఇనుమును సాగదీసిన చేతులవీ.

గన్నుతో మొండి గడ్డపారలను షార్ప్ చేసిన పిడికిళ్లవీ.

ఎన్నాళ్లీ కొలిమి సెగలు..

ఎన్నేళ్లీ వెట్టి బతుకులు..

అని కసితో.. కృషితో చదివి ఐఏఎస్ అయ్యాడొక నిరుపేద యువకుడు.

- దిశ, ఫీచర్స్

సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సంపాదించిన విజేతల గాథలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. ఉప్పిడి ఉపాసముండి.. చదువుకొని పేదరికాన్ని జయించిన వాళ్లెందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో స్మిత్ పంచాల్ ఒకరు.

కుటుంబం కోసం..

స్మిత్ పంచాల్‌ది అహ్మదాబాద్. వాళ్లది కమ్మరి వృత్తి. వేడిగా మండుతున్న ఓ మధ్యాహ్నం. స్మిత్ ఒక నిర్మాణంపై నిలబడి.. ఇనుప పైపులు ఎత్తుతూ వాటికి వెల్డింగ్ చేస్తున్నాడు. అంతలోనే కాల్ వచ్చింది. యూపీఎస్‌సీ ఫలితాల్లో పాసయ్యావని. చూశారా ఎంతటి పేదరికమో.? వాస్తవానికి స్మిత్ ఆ పనిలో ఉండిపోవాలని ఎంచుకోలేదు. అది వాళ్ల కులవృత్తి. వాళ్ల నాన్న హస్ముఖ్ అదే పని చేసీ చేసీ అలసిపోయి అనారోగ్యం పాలయ్యాడు. బరువులు ఎత్తొద్దని చెప్పాడు డాక్టర్. కుటుంబం కోసం పనిచేయాలి కదా.. అందుకే తండ్రి పనిని కొనసాగిస్తున్నాడు స్మిత్.

లక్ష్యం సివిల్స్

హస్ముఖ్‌కు 2011లో ఆపరేషన్ అయ్యింది. దీర్ఘకాలం బెడ్‌రెస్ట్‌లోనే ఉండాలి. కొంతకాలానికి అతడి ఆరోగ్యం కుదుట పడింది. తిరిగి పనిలోకి వెళ్దామనీ.. కొలిమి దగ్గర కూర్చొని పనులు చేద్దామని అనుకున్నాడు. కానీ.. కొడుకు స్మిత్ ఒప్పుకోలేదు. "ఇంకేం చేస్తావ్ నాన్నా.? చాలు. నేనున్నాను కదా.? నువ్వు రెస్ట్ తీసుకో" అని సముదాయించాడు. నాన్నను పనిలోకి పంపించొద్దని అతడు కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఇదే పనిచేస్తూ కాదు. చదువుతో సాధించాలి.. గొప్ప పొజిషన్‌లో ఉండాలని నిర్ణయించుకొని సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు.

క్వాలిఫై కాలేదు

ఇంటర్మీడియట్ పూర్తయింది. డిగ్రీలో ఆర్ట్స్ తీసుకొని 2022లో కంప్లీట్ చేశాడు. ఇన్నాళ్లు పనిచేసిన డబ్బు.. దాచిపెట్టుకున్న కొంత సమకూర్చుకొని ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు. 2023లో ఫస్ట్ అటెంప్ట్ చేశాడు. 2.5 మార్కులతో సీఎస్ఏటీ విభాగంలో తడబడి మెయిన్స్ రాసే అర్హత కోల్పోయాడు. జనరల్‌స్టడీస్‌లో మంచి మార్కులే సాధించినా.. చివరి అయిదు నిమిషాల్లో తొందరపడి తప్పులతో సీఎస్ఏటీలో వెనకబడ్డాడు. నిరాశతో తిరిగి అహ్మదాబాద్ వచ్చేశాడు. చేతుల్లో ఉన్న డబ్బు అయిపోయింది. ఏం చేయాలి అని అపజయాన్ని తలుచుకొని ఆలోచిస్తుండేవాడు.

మళ్లీ ఢిల్లీ ప్రయాణం

ఎన్నాళ్లీ కుమిలిపోవడం. ఫెయిల్యూర్‌ను తలుచుకొని కూర్చుంటే మళ్లీ కొలిమే దిక్కవుతుంది అని ఆత్మపరిశీలన చేసుకున్నాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా మరో ప్రయత్నానికి సిద్ధమయ్యాడు స్మిత్. రెండు నెలలపాటు ఒక కోచింగ్ సెంటర్లో కౌన్సిలర్‌గా పనిచేశాడు. ఆ డబ్బుతో మళ్లీ ఢిల్లీకి వెళ్లాడు. ఈసారి సీఎస్ఏటీ మీద ప్రత్యేకంగా కసరత్తు చేశాడు. గత పరీక్ష ప్రశ్నా పత్రాలను పున:సమీక్షించుకున్నాడు. గణితంపై దృష్టి కేంద్రీకరించి ప్రతీరోజూ మాక్ టెస్టులు రాస్తూ వచ్చాడు. అలా తనను తాను మార్చుకొని 2024 యూపీఎస్సీ రాశాడు. ఫలితాల్లో ఆలిండియా 30వ ర్యాంక్ సాధించాడు.



Next Story

Most Viewed