స్మార్ట్ ఇరిగేషన్ యాప్.. రైతులకు శరణ్య నీటి పాఠాలు..!

by Daayi Srishailam |

హర్యానాలోని సోనీపట్ జిల్లా మందౌరా గ్రామ ప్రజలు ఈ తిప్పలేవీ లేకుండా హాయిగా వ్యవసాయం చేస్తున్నారు

స్మార్ట్ ఇరిగేషన్ యాప్.. రైతులకు శరణ్య నీటి పాఠాలు..!
X

దిశ, ఫీచర్స్: మనకేంటి.. చెప్పడానికి వ్యవసాయం గురించి గొప్పగానే ఉంటుంది. కానీ.. దాంట్లో ఉండే కష్ట నష్టాలు రైతుకు మాత్రమే తెలుసు. కరెంటు టైమ్‌కు ఉండదు. గట్టిగా ఒకరోజు ఆగకుండా నీళ్లు పెడితే బోరు పాడవుతుంది. నీళ్లు లేక బోరు ఎండిపోతుంది. పొలం ఎండిపోయి రైతు కండ్లలో నీరింకి పోతుంది. హర్యానాలోని సోనీపట్ జిల్లా మందౌరా గ్రామ ప్రజలు ఈ తిప్పలేవీ లేకుండా హాయిగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి కారణం 17 ఏళ్ల శరణ్య మెహతా.

డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ యాప్..

శరణ్య మెహతా రైతుల కష్టాలు తీర్చేందుకు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్‌ఎస్) యాప్ డెవలప్ చేసింది. ఈ యాప్ రైతులకు సరైన మార్గదర్శనం చేస్తోంది. మట్టి సెన్సార్లు, ఉపగ్రహ డేటా, రైతుల అభిప్రాయాలతో రూపొందిన ఈ వాయిస్-ఎనేబుల్డ్ యాప్ రైతాంగానికెంతో మేలు చేస్తోంది. ఇది నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు డీజిల్‌ను కూడా ఆదా చేసి పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. ఈ యాప్ వెనక ఉద్దేశం పెద్దదే ఉంది. శరణ్య చిన్నప్పుడు తాతతో కలిసి అల్వార్ గ్రామాల్లో తిరిగేది. భూమి పగుళ్లు రావడం.. పంటలు ఎండిపోవడం లేదా నీటి ముంపుతో నష్టపోవడం వంటివన్నీ కండ్ల ముందే కనిపించేవి.

ఆకారాలు.. కోణాలను కొలిచి..

రైతులు సంప్రదాయాలు, అంచనాలు వేరుగా ఉండేవ. వర్షం రావాలనే ఆశతో రైతులు అవసరం లేకున్నా బోరు మోటారు ఆన్లోనే ఉంచేవాళ్లు. అవసరం లేనప్పుడు వృథాగా పోయి.. అవసరం వచ్చినప్పుడు పొలాలు ఎండిపోయేవి. మట్టిని కొలిచి నీటిని అంచనా వేసి రైతులకు మార్గదర్శనం చేసే మార్గం ఉందా అని ఆలోచించింది శరణ్య. 9వ తరగతిలో రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ ప్రీమియర్ (ఆర్‌సీడీపీ) సాయంతో 'ప్రాజెక్ట్ జల్'ను స్థాపించింది. చెక్ డ్యామ్‌ల ఆకారాలు, కోణాలు, మెటీరియల్స్ గురించి అధ్యయనం చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పరీక్షించింది. రైతులతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుంది.

శ్రీధర్ మార్గదర్శనం..

ఉపరితలం తడిగా ఉన్నా మూలాలు ఎండిపోవడం చూస్తుంటే.. నీటి సేకరణ నిర్మాణాలు మాత్రమే సరిపోవని శరణ్య గ్రహించింది. మట్టి, ఆకాశం రెండింటినీ పరిగణనలోకి తీసుకునే వ్యవస్థ అవసరమని సరికొత్త ఆవిష్కరణకు ఆలోచించింది. ఆర్‌సీడీపీ పనుల్లో భాగంగా మిలిటరీ వెటరన్, ఇంజినీర్, అగ్రిమ్యాట్రిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడైన కమాండర్ శ్రీధర్ కోట్రా మెంటార్‌గా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు. పంటల అవసరాలు, మట్టి ఆకృతి, లోతు, వాతావరణ అంచనాలు వంటి డేటాను సేకరించడంలో మార్గదర్శనం చేశాడు.

తేమ ఉందని గుర్తిస్తుంది..

"డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్‌ఎస్) యాప్‌లో వాయిస్ ప్రాంప్ట్‌లు, స్థానిక భాషలు, ఆఫ్‌లైన్ యాక్సెస్ వంటి ఫీచర్లు ముఖ్యం. 2025లో శరణ్య ప్రాజెక్టు దశలవారీగా అమలైంది. ఇది మూడు దశల్లో పనిచేస్తుంది. సెన్సార్లు, ఉపగ్రహాలు, రైతుల ఇన్‌పుట్ ద్వారా డేటాను సేకరిస్తారు. క్లౌడ్ లాజిక్ ద్వారా పరిస్థిని విశ్లేషించి మ్యాప్.. అలర్ట్ రూపంలో యాప్ ద్వారా సందేశాలు పంపుతారు. పంప్ కంట్రోలర్లు ఉంటే ఆటోమేటిక్‌గా బోరు పోస్తుంది. ఉపరితలం ఎండినట్లు అనిపించినా భూమిలోపల తేమ ఉందని యాప్ చూపించి నీటిని వృథాగా చేయకుండా ఆదా చేసుకోవచ్చు. పంటలు అన్ని సీజన్లలో కాపాడుకోవచ్చు.

Next Story