ప్రతీ తలుపు తట్టి.. పాఠశాలను పండగలా మార్చింది.!

by Daayi Srishailam |

ఆమె ఒక్కరే కష్టపడి ఇంటింటికీ తిరిగి 100 మంది పిల్లల్ని స్కూల్‌కు వచ్చేలా చేసింది

ప్రతీ తలుపు తట్టి.. పాఠశాలను పండగలా మార్చింది.!
X

దిశ, ఫీచర్స్: టీచర్లపై బయట ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉంది. జీతం వస్తే చాలు.. విద్యార్థులు వాళ్ల భవిష్యత్‌తో మనకేం అనేలా ఉంటారు. ఇది నిజం కూడా. కానీ.. అక్కడక్కడ కొందరు గర్వంగా చెప్పుకునేలా పనిచేసే టీచర్లు కూడా ఉంటారు. అలాంటివారిలో ఒకరు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో పనిచేసే టీచర్ సంగీతా మౌర్యా. ఆమె ఒక్కరే కష్టపడి ఇంటింటికీ తిరిగి 100 మంది పిల్లల్ని స్కూల్‌కు వచ్చేలా చేసింది.

ఆరంభమే నిరాశ..

రాయ్‌బరేలిలోని డిబ్లాక్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో సంగీతకు పోస్టింగ్ వచ్చింది. ఒకప్పుడు ఆ స్కూల్‌కు 130 మందికి పైగా విద్యార్థులు వచ్చేవాళ్లు. కానీ.. సంగీత అక్కడికి వెళ్లేనాటికి పట్టుమని 30 మంది కూడా లేరు. "ఇదేం స్కూలండీ బాబూ.. నా దరిద్రానికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు" అని నిరుత్సాహపడింది. ఉద్యోగం రాకముందు ఆధునిక సౌకర్యాలున్న స్కూల్లో.. ఆసక్తిగల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలగన్నది. కానీ అక్కడ చూస్తే స్కూల్ బిల్డింగ్ శిథిలమై ఉంది. బెంచీలు విరిగిపోయి ఉన్నాయి. విద్యార్థులు ఏ క్లాస్ రూంలో చూసినా లేరు. ఈ పరిస్థితి ఆమెకు తీవ్ర నిరాశను కలిగించాయి.

జీవితాల్లో మార్పు..

సంగీతా సవాళ్లను తీసుకుంది. స్కూల్ అయిపోయాక ప్రతీరోజు గ్రామంలోని ఇంటింటికి తిరిగేది. "అమ్మా.. అయ్యా మీ పిల్లల్ని సూల్‌కి పంపండి.. చదువు లేకపోతే విద్యార్థుల భవిష్యత్ అంధకారమైతది" అని వివరించింది. చాలామంది పిల్లలు చిన్న చిన్న పనులు చేసి వచ్చిన డబ్బుతో జర్దా, ఖైనీ కొనడానికి ఖర్చు చేసేవాళ్లు. తల్లిదండ్రులను, పిల్లలను ఒప్పించడం అంత సులభమేం కాదు. కొన్నిసార్లు బతిమాలింది, కొన్నిసార్లు వాదించింది. "కనీసం ఒక్కరోజైనా పంపి చూడండ"ని వేడుకుంది. "పిల్లల్లో మార్పు కాదు.. మీ జీవితాల్లోనే మార్పు తీసుకొచ్చే బాధ్యత" అని చాలా చెప్పింది.

ప్రయత్న ఫలితం..

అలా చెప్పగా చెప్పగా.. తల్లిదండ్రుల ఆలోచనా మారింది. పిల్లల్లోనూ మార్పు కనిపించి 30 మంది కూడా లేని విద్యార్థుల సంఖ్యను 100 మించేలా చేసింది. ఇదంతా ఒక్క నెలలోనే సాధ్యమైంది. ఈ విజయం అంత సులభంగా రాలేదు. రోజూ ఇంటింటికీ తిరగడం, బాలకార్మిక సంప్రదాయాలను సవాలు చేయడం, చదువు గురించి తెలియని తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలవడం వంటివెన్నో చేసి సక్సెస్ అయింది. వెలవెలబోయిన స్కూల్‌లో కథలు, పాటలు వినిపించసాగాయి. నూతన విద్యా పద్ధతులతో ఖాళీ గదులను విద్యార్థుల నవ్వులు, ఆశలతో నింపగలిగింది.

స్నేహితురాలిగా.. తల్లిగా..

పిల్లలు రెగ్యులర్‌గా హాజరయ్యాక కొత్త సవాలు ఎదురైంది. వాళ్లు కూర్చొని వినడానికి ఇష్టపడలేదు. జానపద కథలు, రిడిల్స్, ఇంటరాక్టివ్ యాక్టివిటీలను ఉపయోగించి బోధనను మార్చింది. సంగీత సంస్కృతం, ఇంగ్లీష్, హిందీని బోధిస్తూనే పిల్లలకు జీవిత పాఠాలు నేర్పిస్తోంది. ఆ పాఠశాలలో కేవదలం ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నప్పటికీ సంగీత వాళ్లను సమన్వయం చేస్తూ టీచరంటే కేవలం సబ్జెక్ట్ చెప్పడమే కాదు.. టీచర్ ఒక కౌన్సెలర్, ఫ్రెండ్, కొన్నిసార్లు తల్లిలాంటి వ్యక్తి అని నిరూపిస్తోంది. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లల మధ్యలో కూర్చొని వాళ్లు తినేదే తింటుందంటే ఆ మనసెంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

Next Story