జీతం కొంచెం.. ధరలు అధికం : సామాన్యుడి సొంతింటి కల సాధ్యమేనా?

by Sujitha Rachapalli |   (  Updated:2026-05-24 06:49:17  IST  )

సామాన్యుడు సొంతింటి కలకు దూరమవుతున్నాడు. ప్రతి ఏటా ధరలు అధికంగా పెరుగుతున్నా.. జీతం మాత్రమే అలాగే ఉండిపోతుంది. దీనికి తోడు ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు

జీతం కొంచెం.. ధరలు అధికం : సామాన్యుడి సొంతింటి కల సాధ్యమేనా?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : సామాన్యుడు సొంతింటి కలకు దూరమవుతున్నాడు. ప్రతి ఏటా ధరలు అధికంగా పెరుగుతున్నా.. జీతం మాత్రమే అలాగే ఉండిపోతుంది. దీనికి తోడు ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ వ్యయం వంటి రకరకాల కారణాలతో తక్కువ ఆదాయం కలిగిన వారికి, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొందామనే ఆలోచనను వెనక్కి నెడుతున్నాయి.

మధ్యతరగతి కష్టాలు..

సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఇల్లు కొనడం అనేది తన జీవితకాల కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పేదలకు సొంత స్థలం ఉంటే ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తోంది. శ్రీమంతులు విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం సాయం అందక.. సొంతంగా ఇంటిని నిర్మించుకోలేక సతమతమవతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే సామాన్యులకు రూ.50 లక్షల ఇల్లు కొనడం సవాల్‌గా మారింది. ఓ వ్యక్తి రూ.80 వేలు ప్రతీ నెలా సంపాదిస్తుంటే.. అతడు రూ.50 లక్షల ఇల్లు కొనగలడా? జీతంలో ఈఎంఐ కచ్చితంగా 30 శాతం మించకూడదు. రూ.40 లక్షల గృహ రుణానికి (రూ.50 లక్షల ఇంటిపై రూ.10 లక్షల డౌన్ మెంట్ తర్వాత) సుమారు రూ.30 నుంచి రూ.35 వేల వరకు ఈఎంఐ అవుతుంది. మరి ఇంతటి రుణాన్ని సదరు వ్యక్తి హ్యాపీగా భరించాలంటే కచ్చితంగా నెల జీతం రూ.1.20 లక్షలు ఉండాలి. రూ. 80 వేలు జీతం ఉన్న వ్యక్తి ఇంతటి స్థాయిలో ఇల్లు కొనాలంటే.. ఆర్థిక ఒత్తిడి తప్పదు. ఇంటిని కొనుగోలు చేయాలనే తొందరలో లోన్స్ తీసుకుని.. 25 నుంచి 30 సంవత్సరాల పాటు రుణ భారం మోయడం కష్టంతో కూడుకున్న పని అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

ధరలు పైపైకి..

నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా చదరపు అడుగు ధర సగటున ఆరు వేలకు పైగానే పలుకుతోంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. నాలుగు వేలకు చదరపు అడుగు విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్నా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోట రూ. 80 లక్షలు లేనిదే ఇల్లు రావడం లేదు. ట్రిపుల్ బెడ్ రూమ్ కోటి పెట్టాల్సిందే. ఐటి కారిడార్‌లో ఏకంగా కోట్ల పై మాటే.. దీనికి తోడు బిల్డర్లు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. అప్పట్లో పార్కింగ్ ఒక్కదానికి చార్జ్ చేసేవారు. ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్‌ఫ్రా, క్లబ్ హౌస్ చార్జీలు, గ్యాస్ పైపులైన్ కనెక్ష‌న్‌కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి సామాన్య వర్గాలకు భారంగా మారుతున్నాయి.

పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టి పెడితే..

తక్కువ జీతం ఉన్నవారు పాసివ్ ఇన్ కమ్‌పై దృష్టిపెడితే మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు రూ.50 లక్షలను ఒక్క శాతం వడ్డీకి పెట్టుబడి పెడితే నెలకు రూ.50 వేల పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. ఈ ఆదాయం ఇంటి ఈఎంఐ లేదా అద్దెను సులభంగా కవర్ చేస్తుంది. ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక భద్రతను అందిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆర్డీ లాంటి వాటిలో మొదటిగా ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తే మంచిదని చెబుతున్నారు.

Next Story