అమెరికా ఉద్యోగం వదిలేసి.. బయోడైవర్సిటీ వైపు ప్రయాణం.!

by Daayi Srishailam |

అమెరికాలో అద్దాలమేడ కంటే ఇండియాలోని మట్టి ఇల్లే బెటర్ అనుకున్నారు

అమెరికా ఉద్యోగం వదిలేసి.. బయోడైవర్సిటీ వైపు ప్రయాణం.!
X

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌లోని బడ్‌నగర్‌కు చెందిన సాక్షి భాటియా, అర్పిత్ మహేశ్వరి అమెరికాలోని కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం. సౌకర్యవంతమైన జీవితం. కానీ అవి వాళ్లకు సంతృప్తినివ్వలేదు. అమెరికాలో అద్దాలమేడ కంటే ఇండియాలోని మట్టి ఇల్లే బెటర్ అనుకున్నారు.

జీవంతిక ఫార్మ్..

అమెరికా నుంచి బయలుదేరే ముందు తమ ఆస్తులను అమ్మేశారు. మినిమలిస్ట్ జీవనశైలిని అవలంబించారు. అమెజాన్, పెరూ, ఈక్వడార్, కొలంబియాలో బ్యాక్‌ప్యాకింగ్ చేస్తూ వారి పర్యావరణ స్పృహ బలపరుచుకున్నారు. 2017లో ఇండియాకు తిరిగి వచ్చి ప్రకృతికి దగ్గరగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు. "మేము మా సొంత ఆహారాన్ని పండించి, మరింత ఆలోచనాత్మక జీవనాన్ని గడపాలనుకున్నామం" అని సాక్షి చెబుతుంది. 1.5 ఎకరాల భూమిలో ‘జీవంతిక’ ఫార్మ్‌ను స్థాపించారు. ఇప్పుడు వాళ్లు వినియోగించే ఆహారంలో 85% సొంతంగా పండిస్తున్నారు.

మట్టి ఇంటి నిర్మాణం..

అమెరికాలో అద్దాల మేడలో ఉన్నవాళ్లు.. బడ్‌నగర్‌లో మట్టి ఇంటిని కట్టుకున్నారు. మట్టి ఇంటిని నిర్మించడం అత్యంత కష్టమైన పనైనప్పటికీ చాలా సంతృప్తికరంగా ఉందని వారంటున్నారు. ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. విద్యుత్ లేనప్పటికీ ఈ ఇల్లు వేసవి గరిష్టంలో కూడా చల్లగా ఉంటుంది. ఫ్యాన్లు లేదా ఎయిర్ కండిషనర్ల అవసరం లేకుండా సౌకర్యాన్ని అందిస్తుంది. రిఫ్రిజిరేటర్‌ను కూడా ఉపయోగించడం మానేశారు. ఎందుకంటే అవసరమైనప్పుడు తాజా కూరగాయలు, పండ్లను నేరుగా పొలం నుంచి తీసుకుంటారు కాబట్టీ.

పర్మాకల్చర్..

జీవంతిక ఫార్మ్ పర్మాకల్చర్ సూత్రాలను అనుసరిస్తుంది. ఇది పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తుంది. ఈ విధానం సాంప్రదాయ రసాయన-ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతులకు విరుద్ధంగా జీవవైవిధ్యం, నేల ఆరోగ్యం, సేంద్రీయ వ్యవసాయం, నీటి సంరక్షణను ప్రోత్సహిస్తుంది. పర్మాకల్చర్ ప్రకారమే సాక్షి, అర్పిత్ వివిధ రకాల పంటలను, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పండిస్తారు. అలాగే కంపోస్టింగ్ పిట్స్, వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు ఏర్పరిచారు. సహజ పురుగుమందులను అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులు వారి ఫార్మ్‌ను స్థిరమైన వ్యవసాయానికి ఒక మోడల్‌గా నిలిపాయి.

ఇంజినీరింగ్ అనుభవంతో..

అమెరికాలో ఐటీ కెరీర్ వదిలేసి వ్యవసాయ రంగంలోకి రావడం సులభమైన నిర్ణయం కాదు. అనుభవం లేకపోవడంతో నేల నిర్వహణ, సేద్యం, స్థానిక వాతావరణం, వ్యవసాయ పద్ధతుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. అయితే వారి ఇంజనీరింగ్ నేపథ్యం సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని అందించింది. సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి సాంప్రదాయ వ్యవసాయ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అమలు చేశారు. రైతులతో కలిసి పనిచేస్తూ వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ డెమోలను నిర్వహిస్తున్నారు. సంస్థలు, పాఠశాలలతో కలిసి పర్యావరణ స్థిరత్వ అవగాహన కల్పిస్తున్నారు.

Next Story