పుస్తకమే సర్వస్వం.. ఆధునిక కాలంలోనూ తగ్గని ఆదరణ

by Disha Web Desk 7 |
పుస్తకమే సర్వస్వం.. ఆధునిక కాలంలోనూ తగ్గని ఆదరణ
X

దిశ, ఫీచర్స్ : పుస్తకం.. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. వికాసాన్ని కలిగిస్తుంది

పుస్తకం.. అజ్ఞానాన్ని తరిమి కొడుతుంది. కొంగ్రొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది

పుస్తకం.. నిరాశలో నువ్వున్నప్పుడు ఆశల హరివిల్లయి అరుదెంచుతుంది

పుస్తకం.. సమస్యల సుడిగుండాలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు పరిష్కారమార్గమై దారి చూపుతుంది

పుస్తకం.. యుద్ధరంగంలో నువ్వు ఒంటరివై ఏమీ తోచనప్పుడు ఏకవ్యక్తి సైన్యమై ఎదిరించే ధైర్యాన్నిస్తుంది

పుస్తకం.. అమ్మలాలనలోని హాయినిస్తుంది.. కోయిలపాటలోని తీయందనాలను పంచుతుంది

అవును.. పుస్తకమొక విజ్ఞాన సర్వస్వం. అందుకేనేమో 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు. పుస్తకానికుండే పవర్ అలాంటిదని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. పుస్తకాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. బడిలో చదివేటప్పుడైనా, ఉద్యోగం చేసేటప్పుడైనా, ఇంజినీరింగైనా, ఎంబీబీఎస్ అయినా, ఏ చదువైనా సరే అక్షరాల రూపంలో, పదబందాల అనుబంధాలతో, వాక్య నిర్మాణాల వరుసలతో పుస్తకాల రూపంలో ఇమిడి ఉంటుంది. సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, రాజకీయమైనా, సామాజికమైనా, రంగమేదైనా, సబ్జెక్టు మరేదైనా పుస్తక రూపం సంతరించుకుంటుంది.

ఏదైనా అంశంపట్ల సందేహం కలిగిందంటే చాలు.. నివృత్తి చేసుకోవడానికని కంప్యూటర్లోనో, బుక్ స్టాల్‌ లోనో మనం ముందుగా వెతికేది పుస్తకాలనే. ఏ విషయాన్ని లోతుగా తెలుసుకోవాలన్నా అందుకు సంబంధించిన పుస్తకాలు ఏమున్నాయని చూస్తుంటాం. కాలం గిర్రున మారవచ్చు. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక పరిణామాలు జరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా.. పుస్తకానికేం ఢోకా లేదు. అది మనకు అనేక రూపాల్లో సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తూనే ఉంది. మారుతున్న కాలంతోపాటు కొత్త రంగులను, హంగులను సంతరించుకుని ఆధునికతలో ఇమిడిపోతోంది తప్ప, పుస్తకం ఆదరణ మాత్రం కోల్పోలేదు. ఇంకెప్పటికీ కోల్పోదు కూడా. ఎందుకంటే ప్రతి విషయాన్నీ, ప్రతి అంశాన్నీ అక్షరాల రూపంలో భద్ర పర్చుకునే అన్ లిమిటెడ్ మెమరీ పవర్ కలిగిన విజ్ఞానగని పుస్తకం.

అన్నింటికీ పునాది అదే

మానవ వికాసానికీ, సామాజిక విశ్లేషణకూ, సైన్స్ నిరూపణకూ, సాహిత్య ప్రక్రియకు దేనికైనా పుస్తకమే ఆధారం. అదే అన్నింటికీ పునాది. అందులో అన్ని అంశాలూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే బహు రకాల ఆలోచనల సమాహారం పుస్తకం. అన్ని రకాల భావజాలపు వేదిక పుస్తకం. సూర్య కాంతి స్వచ్ఛమైన తటాకములలోని నీటినీ ఆవిరి చేయగలదు. అలాగే డ్రయినేజీల్లోని మురుగు నీటినీ ఆవిరి చేయగలదు. అంతమాత్రాన సూర్యుడికి, సూర్యకాంతికి ఉన్న తేజస్సు, శక్తి మారదు. తేటగా ఉన్న నీటిని ఆవిరి చేసినప్పుడు స్వచ్ఛంగానూ, మురికి నీటిని ఆవిరి చేసినప్పుడు మురికిగాను సూర్యుడు మారిపోడు. తన ఉనికిని ఎన్నికీ కోల్పోడు. పుస్తకం కూడా అంతే. తరాలు మారినా, కాలాలు మారినా దాని ఉనికి మారలేదు. జీవనదిలా ప్రవహిస్తూ, అవసరమైన మార్పులను సంతరించుకుంటూ మనవెంటే పరుగెడుతోంది తప్ప అలసీ సొలసి ఆగిపోలేదు పుస్తకం.

అజ్ఞానపు అమావాస్య చీకట్లను చీలుస్తూ.. పున్నమి వెలుగులను ప్రసరిస్తూనే ఉంది పుస్తకం. అపజయాల దారుల్లో కూడా విజయ తీరాలకు చేర్చే మార్గదర్శిగా నిలుస్తోంది పుస్తకం. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్ర్తీ ఉంటుంది అన్నట్లుగానే.. ప్రతీ సక్సెస్ వెనుక ఒక మంచి పుస్తకం ఉంటుంది. ఒక వ్యక్తి మంచి గుర్తింపు పొందడం వెనుక ప్రేరణగానూ అది నిలుస్తుంది. ఒక వ్యక్తి రచయిగా, మేధావిగా మారడం వెనుకక పుస్తకం ఉంటుంది. ఒక వ్యక్తి సైంటిస్టుగా, సైకాలజిస్టుగా, కమ్యూనిస్టుగా మారడానికీ పుస్తకం కారణం అవుతుంది. అంతేకాదు డాక్టర్‌గా, ఇంజినీర్‌గా, మోటివేటర్‌గా, ఫిలాసఫర్‌గా, ఆధ్యాత్మిక వేత్తగా, ఆధునిక మానవుడిగా మనుషులు తమ తమ గుర్తింపులతో ఫోకస్ అవడం వెనుక పుస్తకాల పాత్ర లేదని చెప్పగలిగే దమ్మూ ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే పుస్తకానికున్న పవర్ కాంతిశక్తి, విద్యుచ్ఛక్తి, తరంగ శక్తి ఇలా.. భూమిపై ఉన్న అన్ని రకాల శక్తులకంటే కూడా ప్రభావవంతమైన మహాశక్తిగా చెప్పవచ్చు.

నడిపించేవి.. మురిపించేవి పుస్తకాలే

కొన్ని పుస్తకాలు మనల్ని ఆనందలో ముంచెత్తుతాయి. కొన్ని పుస్తకాలు మనలో ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని పుస్తకాలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంకొన్ని పుస్తకాలు మనల్ని కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తాయి. పుస్తకాలు భావజాలపు బాంధవ్యాన్ని పెంచుతాయి కొన్ని పుస్తకాలు. భౌతికవాద జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి మరికొన్ని పుస్తకాలు. కొన్ని పుస్తకాలు చారిత్రాత్మక వాస్తవాలను వెల్లడించే వారధులవుతాయి. కొన్ని పుస్తకాలు చరిత్రను వక్రీకరించే చీకటి పుటలు కూడా అవుతాయి. కొన్ని పుస్తకాలు ఉరకలెత్తే ఉత్సాహాన్ని నింపుతాయి. మరికొన్ని పుస్తకాలు ఉద్యమ పాఠాలై విప్లవాగ్ని రగిలిస్తాయి. కొన్ని పుస్తకాలు శరదృతు వర్ణనలై మదిని రంజింపజేస్తాయి. మరికొన్ని పుస్తకాలు వసంతకాలపు మేఘగర్జనలై మనల్ని తట్టిలేపుతాయి.

కృష్ణశాస్ర్తి భావుకతలై అలరిస్తాయి పుస్తకాలు, బాపుగీసిన వర్ణచిత్రమై ఆకర్షిస్తాయి పుస్తకాలు. శ్రీ శ్రీ మహా ప్రస్థానంలోని జగన్నాథ రథచక్రాలై దొర్లుతాయి పుస్తకాలు. చలం రాతల 'వలపు మైదాన'ములై అలరిస్తాయి పుస్తకాలు. ఎంకిపాటల రాగాలై రంజింపజేస్తాయి పుస్తకాలు. వెన్నెల రాత్రుల్లో విరహా గీతాలై మదిని తడుముతాయి పుస్తకాలు.. ఇలా ఒకటా రెండా ఎంతని చెప్పాలి? ఏమని వర్ణించాలి పుస్తకాల గురించి. పుస్తకాలు చదివితేనే అందులోని అసలైన మాధుర్యం మనకు తెలిసొస్తుంది. పుస్తకం చదివితేనే ఆనందమో, ఆవేదనో, ఆవేశమో, ఆత్రుతో మనల్ని కదిలిస్తుంది. ఇంకెందుకాలస్యం హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యింది. వెళ్లి తనివి తీరా చూసి, నచ్చిత పుస్తకాన్ని వెంట తెచ్చుకొని పుస్తకం అందించే విజ్ఞానాన్నో, మాధుర్యాన్నో తనివితీరా అనుభవిద్దాం చలో!

పుస్తకం-చరిత్ర

పుస్తకం ప్రభావవంతమైనది కాబట్టే దానికో ప్రత్యేకత ఉంది. పుస్తక దినోత్సవం, పుస్తక మేళాలు వంటివి మనం చూస్తుంటాం. ఏటా పుస్తక దినోత్సవం కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంటారు. చరిత్రలోకి ఒకసారి తొంగిచూస్తే 17వ శతాబ్దంనాటి యూరప్‌లో పుస్తక దినోత్సవాన్ని సెయింట్ జార్జ్ డే‌గా పాటించేవారట. స్పెయిన్‌లో కూడా పుస్తక దినోత్సవం వేళ ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారట. సెవాంతెస్, షేక్స్ పియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఏప్రిల్ 23న మరణించినందున ఆరోజు పలు దేశాల్లో పుస్తక దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో 1955లో ప్రకటించింది. 2017లో రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని 'కొనాక్రీ' సిటీని, 2018లో గ్రీస్‌లోని 'ఏథెన్స్‌' నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది యునెస్కో. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువగా పుస్తక ప్రియులు ఉన్నదేశం ఇండియానే. భారతీయులు వారానికి సగటున 10.2 గంటలపాటు బుక్ రీడింగ్ చేస్తారని దశాబ్దం క్రితమే ఓ అధ్యయనంలో తేలింది. 2013 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరిగిందంటే.. 2022లో అది మరింత రెట్టింపయ్యి ఉండవచ్చు అంటున్నారు పుస్తక అభిమానులు, విశ్లేషకులు.

డిజిటలైజేషన్ దిశగా పుస్తకాలు

ప్రస్తుతం పుస్తకాలు డిజిటలైజేషన్‌ను సంతరించుకుంటున్నాయి. రచయితలు తమ పుస్తకాలను పీడీఎఫ్‌ల రూపంలో నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని ఈ బుక్స్ అని పిలుస్తాం. అయితే ప్రపంచంలో ఈ బుక్స్ విధానం 20 ఏండ్లనాటి నుంచి అందుబాటులో ఉందని తెలుస్తోంది. 1991లో తయారు చేసిన ఈ బుక్ బైబిల్‌. ఆ తర్వాత అనేక పుస్తకాలు ఇంటర్నెట్‌లో ఇమిడిపోవడం ప్రారంభమైంది. నేడు అనేక పుస్తకాలు ఈ బుక్స్ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం మనం వాడే మొబైల్‌ఫోన్‌లో కూడా ఈ-బుక్‌ ఈజీగా చదువుకోవచ్చు. అంటే చరిత్రలో పుస్తకం ఎప్పటికప్పుడూ తన రూపం మార్చుకుంటూ పాఠకులకు అందుబాటులోకి వస్తోంది తప్ప, ఆదరణ కోల్పోయిన దాఖలాలు లేవు. పుస్తకాల్లోనే సర్వస్వం ఉంది. విజ్ఞానానికి, భాషా పరిజ్ఞానానికి, సానుకూల దృక్పథం అలవర్చుకోవడానికీ, సామాజిక పరిజ్ఞానం ఏర్పడటానికి దేనికైనా కేరాఫ్ పుస్తకమే మరి.

READ MORE

మీరు రోజు రెండు లేక మూడు లవంగాలను తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !

Next Story

Most Viewed