ఇండియన్ ఏఐ కిడ్.. ప్రభుత్వాలే సలామ్ కొడుతున్నాయ్.!

by Daayi Srishailam |

ఈ కుర్రోన్ని "భారత టెక్ భవిష్యత్తుకు ఆశాకిరణం" అని పొగిడారు

ఇండియన్ ఏఐ కిడ్.. ప్రభుత్వాలే సలామ్ కొడుతున్నాయ్.!
X

దిశ, ఫీచర్స్: 16 ఏళ్ల వయసులో సగటు ఇండియన్ టీన్స్ ఏంచేస్తుంటారు.? ఏ ఇన్‌స్టా రీల్సో స్క్రోల్ చేస్కుంట టైంపాస్ చేస్తుంటారు. అంతేకదా.? కానీ కేరళకు చెందిన రౌల్ జాన్ అజు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌ను దున్నేస్తున్నాడు. ఏకంగా ప్రభుత్వాలే పిలిపించుకొని పని చేయించుకుంటున్నాయి.

గవర్నమెంట్ స్కూల్..

కొచ్చి కుర్రాడు రౌల్ జాన్ అజు ఇండియన్ "ఏఐ కిడ్‌"గా గుర్తింపు పొందాడు. పదో తరగతి చదువుతున్న ఈ యువ టెకీ చదివేది ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూట్ కాదు. సాధారణ ప్రభుత్వ వొకేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు మనోడు. అయితే జాన్ సాధనలు అసాధారణం. ఏఐ టూల్స్ తయారీ.. స్టార్టప్ నడిపించడం.. ప్రపంచ వేదికలపై మాట్లాడటం.. లక్షలాది మందికి ఉచిత శిక్షణ ఇస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో శశి థరూర్‌తో జరిగిన సంభాషణ వైరల్ అయింది కదా. ఆ సందర్భండా అతడు ఈ కుర్రోన్ని "భారత టెక్ భవిష్యత్తుకు ఆశాకిరణం" అని పొగిడారు.

తనలాంటి రోబో..

రౌల్ జాన్ అజు ఆరేళ్ల వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అన్వేషించడం మొదలుపెట్టాడు. 12 ఏళ్ల వయసులో మొదటిసారిగా రోబోను తయారు చేశాడు. ఆ తర్వాత మీబోట్ అనే ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించాడు. ఈ రోబో స్పెషాలిటీ ఏంటంటే అది జాన్ సొంత గొంతుతో.. అదికూడా మనోడు మాట్లాడినట్లే మాట్లాడుతుంది. అంతేకాదు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానాలిస్తుంది. "నేను లేజీగా ఉండటం వల్లే దీన్ని తయారు చేశాను" అని ఫన్నీగా చెప్తుంటాడు. సెషన్ తర్వాత విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి తన క్లోన్‌ను సృష్టించాడట.

నాన్నకే ఉద్యోగమిచ్చాడు..

రౌల్ ఏఐ రియల్ఎం టెక్నాలజీస్ అనే స్టార్టప్ స్థాపించాడు. ఆశ్చర్యం ఏంటంటే.. మామూలుగా పేరెంట్స్ ఏదైనా పని చేస్తుంటే డబ్బుల కోసమో.. నేర్చుకోవడం కోసం పిల్లలు దాంట్లో చేరుతుంటారు. కానీ ఇక్కడ 16 ఏళ్ల వయసున్న రౌల్ స్టార్టప్‌లో వాళ్ల నాన్న దీనిలో ఉద్యోగిగా చేరాడు. లీడర్‌షిప్ అనేది ఇంటి నుంచే మొదలవుతుందనే దానికి ఇది చక్కటి సందేశంగా చెప్పుకోవచ్చు. ఇలా మొత్తొ 10కి పైగా ఏఐ ప్రొడక్ట్స్ తయారు చేశాడు రౌల్. వాటిలో "న్యాయసాథీ".. "జస్ట్ ఈజ్".. "మిబోట్".. "జాప్ గ్యాప్" ముఖ్యమైనవి. "న్యాయసాథీ" ఒక లీగల్ అసిస్టెంట్ బాట్. "జస్ట్ ఈజ్".. దుబాయ్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాట్.

1.4 లక్షల మందికి శిక్షణ..

జాన్ ప్రధాన ప్రాజెక్ట్ "ప్రాజెక్ట్47ఎక్స్". ఇది కేరళ.. దుబాయ్ ప్రభుత్వాలతో కలిసి తయారు చేస్తున్న లీగల్ ఏఐ ప్లాట్‌ఫాం. దీనిద్వారా ప్రజలకు చట్టాలు.. ఎమర్జెన్సీల్లో స్టెప్స్ తెలియజేస్తారు. లాయర్లను రీప్లేస్ చేయడం కాదు.. సిస్టమ్ భారాన్ని తగ్గించడమే వీటి లక్ష్యం. ఇండియాలో 5.3 కోట్ల పెండింగ్ కేసుల నేపథ్యంలో ఇది చాలా ఉపయోగకరం. యూట్యూబ్‌లో ఏఐని ఎ నుంచి జెడ్ వరకు ఉచితంగా బోధిస్తాడు. ఐఐటీ మద్రాస్.. గూగుల్ ఈవెంట్స్.. అంతర్జాతీయ ఫోరమ్‌లలో వర్క్‌షాప్స్ నిర్వహించాడు రౌల్. ఇండియా.. దుబాయ్.. అమెరికా.. ఇంగ్లండ్‌లో 1.4 లక్షల మందికి శిక్షణ ఇచ్చాడు.

Next Story