ఓ పరదేశీ.. విదేశీ పక్షుల ఐసీయూ.!

by Daayi Srishailam |

వెటర్నరీ డాక్టర్‌గా సేవలందిస్తూ వలసొచ్చిన విదేశీ పక్షులకు ఐసీయూను ఏర్పాటు చేసింది

ఓ పరదేశీ.. విదేశీ పక్షుల ఐసీయూ.!
X

దిశ, ఫీచర్స్: కంజుపిట్ట కనిపిస్తే కాల్చుకు తినాలి అనుకుంటాం మనం. ఏదైనా కొత్త పక్షి కనిపిస్తే తరిమికొడతాం. పక్షులంటే అంత చిన్నచూపు కొందరికీ. కానీ కేరళకు చెందిన డాక్టర్ రాణి మారియా థామస్‌కు ఈ పక్షులే అన్న.. తమ్ముడు.. అక్కా.. చెల్లె. చిన్నప్పటి నుంచీ పక్షుల మధ్యే పెరిగింది. వెటర్నరీ డాక్టర్‌గా సేవలందిస్తూ వలసొచ్చిన విదేశీ పక్షులకు ఐసీయూను ఏర్పాటు చేసింది.

విదేశీ పక్షుల ఆశ్రయం..

ఆలప్పుజా ఎన్‌హెచ్66లో "సారా బర్డ్స్ అండ్ ఎగ్జాటిక్ యానిమల్ హాస్పిటల్" ఉంటుంది. ఇక్కడ విదేశీ పక్షుల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. దీంట్లో ఎండోస్కోపీ.. ఎక్స్‌రే.. గ్రూమింగ్ వంటి సర్వీస్‌ అందిస్తారు. ఈ హాస్పిటల్‌ను రన్ చేస్తు్న్నది రాణి. వాస్తవానికి ఈ హాస్పిటల్ రాణివాళ్ల పేరెంట్స్ పెట్ ఫాంలో భాగం. వాళ్లు 40 ఏళ్లుగా ఇక్కడ విదేశీ పక్షులకు వైద్య సేవలందిస్తున్నారు. వీళ్లింట్లో మనుషుల కంటే పక్షులు.. జంతువులే ఎక్కువుంటాయి. 2018లో వరదలొచ్చినప్పుడు ఈ ఇల్లు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు.. కుక్కలకు ఆశ్రయంగా మారిందంటే వారి ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మొకా మరణంతో..

రాణి ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించినా వాళ్ల నాన్న సలహాతో వెటర్నరీ మెడిసిన్ ఎంచుకుంది. ఇండియాలో వలస పక్షులు.. జంతువులకు వెట్స్ చాలా తక్కువ. అందుకే రాణిని ఆ మార్గం ఎంచుకోమని చెప్పాడు వాళ్ల నాన్న. ఆ అభిరుచితోనే రాణి కేరళ వెటర్నరీ అండ్ అనిమల్ సైన్స్ యూనివర్సిటీలో యూజీ.. వయనాడ్‌లో పీజీ చేసింది. ప్రతీరోజూ లైబ్రరీలో అవియన్ మెడిసిన్ పుస్తకాలు అడిగే ఒకే ఒక్క స్టూడెంట్ తను. అంతేకాదు.. క్లాసులో ఏకైక మహిళా విద్యార్థి కూడా. రాణివాళ్ల ఫాంలో మొకా అనే పక్షి అనారోగ్యంతో మరణించింది. భావోద్వేగానికి గురైన రాణి విదేశీ వలస పక్షుల పట్ల శ్రద్ధ తీసుకుంది.

అబుదాబిలో ఎక్సటర్న్‌షిప్..

మొకా చనిపోయినప్పుడు చలించిపోయిన రాణి మనుషులకు ఉన్నట్లే పక్షులకూ స్పెషల్ కేర్ అవసరం అనుకున్నది. ఏదో తూతూమంత్రంగా బ్రీడర్లు.. హోమ్ రెమిడీలు వాటి ప్రాణాలను కాపాడలేవనేది తన ఉద్దేశం. దీనికితోడు ఇండియాలో అవియన్ స్పెషలిస్టులు చాలా తక్కువ. పీజీ తర్వాత అబుదాబి ఫాల్కన్ హాస్పిటల్‌లో ఎక్సటర్న్‌షిప్ చేసింది. అరబ్ షేక్‌లు ఫాల్కన్‌లను ఇండ్లలోనే పెంచుకోవడం తనకు నచ్చింది. వాటి గురించి తీసుకునే కేరింగ్ చూసి.. ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలని అనుకుంది రాణి. అక్కడే పక్షుల ఎండోస్కోపీ.. ఎక్స్‌రే.. అల్ట్రాసౌండ్.. ఇన్‌హేలెంట్ అనెస్థీషియా నేర్చుకుంది.

మనుషుల హాస్పిటల్‌తో పోటీ..

"సారా బర్డ్స్ అండ్ ఎగ్జాటిక్ యానిమల్ హాస్పిటల్"లో ఐసీయూ.. డయాగ్నోస్టిక్ ల్యాబ్.. ఫార్మసీ వంటివి ఏర్పాటుచేసి మనుషుల హాస్పిటల్‌తో పోటీపడేలా నిర్వహిస్తోంది. ఆ వైద్య సదుపాయాలన్నీ సక్రమంగా అందుతున్నాయి కాబట్టే ఇప్పుడక్కడ అరుదైన విదేశీ మాకాలు.. కాకటూస్.. హార్న్‌బిల్స్.. ఫ్లామింగోస్.. వల్చర్స్.. గ్రే పార్రట్స్.. అమెజాన్స్.. లోరికీట్స్.. రోజెల్లాలు.. లవ్‌బర్డ్స్ వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కేరళతో పాటు తమిళనాడు.. బెంగళూ.. హైదరాబాద్ నుంచి పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఇలాచేసి విదేశీ పక్షులను కూడా స్పెషల్ కేరింగ్‌గా చూసుకోవాలనే సందేశాన్నిస్తోంది రాణి.

Next Story