ఐఏఎస్ అధికారికి ఐరాస పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2025 అవార్డు

by Daayi Srishailam |

ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్.. సుప్రియా సాహూ

ఐఏఎస్ అధికారికి ఐరాస పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2025 అవార్డు
X

దిశ, ఫీచర్స్: మనం చేసే పనులే మనల్ని సమాజంలో నిలబెడతాయి. పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి. తమిళనాడు ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ దీనిని మరోసారి నిరూపించింది. ఐక్యరాష్ట్ర సమితి ఇచ్చే అత్యున్నత పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2025 అవార్డును సుప్రియ అందుకుంది. వాతావరణం.. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణలో ఆమె చేసిన కృషికి దక్కిన గుర్తింపు ఇది.

మనం నేర్చుకోవాల్సిన పాఠాలు..

సుప్రియా సాహూ తండ్రి ఉద్యోగం కారణంగా దేశమంతటా ప్రయాణించాల్సి వచ్చేది. చిన్నప్పటి నుంచే ఆమె అడవులు.. పర్వతాలు.. నదులు, వన్యప్రాణులతో సన్నిహితంగా ఉండేది. ఇది తనలో ప్రకృతి పట్ల లోతైన ప్రేమను ఏర్పరిచింది. ముఖ్యంగా ఏనుగుల పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ. సోషల్ మీడియాలో ఏనుగుల ఫోటోలు షేర్ చేస్తూ వాటి స్థైర్యం.. నాయకత్వం.. బంధాల నుంచి మనుషులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని చెప్తోంది. ఈ ఎమోషనల్ అటాచ్మెంటే తన 30 ఏళ్ల ఐఏఎస్ కెరీర్‌లో తాను తీసుకున్న కీలక నిర్ణయాలకు ఆధారమైందని చెప్తుంది సుప్రియ.

పిల్లల కళ్లలో ఆనందం..

ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ.. వన్యప్రాణి పరిరక్షణ.. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సుప్రియ చేసిన పని అద్భుతమని చెప్పొచ్చు. స్థానిక సంప్రదాయాలు.. ఆధునిక పరిష్కారాలను మేళవించి వాతావరణ మార్పు ప్రభావాల నుంచి గ్రామీణ ప్రజలను రక్షించిందామె. దాదాపు 1.2 కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచింది. సాయం పొందిన ప్రజలు.. ముఖ్యంగా పిల్లల కళ్లలో ఆనందం చూసి మరింత ప్రేరణ పొందింది. తాను చేసిన ఈ కృషికి నైరోబీలో ''ఇన్‌స్పిరేషన్ అండ్ యాక్షన్'' కేటగిరీలో ''ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2025'' అవార్డు అందుకుంది.

అతిపెద్ద మార్పులు..

1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా సుప్రియ తమిళనాడు.. కేంద్ర ప్రభుత్వాల్లో కీలక పదవులు నిర్వహించింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.. ఏఐడీఎస్ కంట్రోల్ సొసైటీ.. నీలగిరి టీ గ్రోవర్స్ కోఆపరేటివ్.. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ వంటి బాధ్యతాయుత హోదాల్లో కొనసాగింది. దూరదర్శన్‌లో ఆదాయం పెంచి ఆధునికీకరణ చేసిన ఘనత తనదే. ప్రస్తుతం తమిళనాడు ఎన్విరాన్‌మెంట్.. క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్స్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ పర్యావరణ రంగంలో అతిపెద్ద మార్పులు తీసుకొస్తోంది. ఆమె నేతృత్వంలోనే దేశంలోనే తొలి స్టేట్ గ్రీన్ క్లైమేట్ కంపెనీని ప్రారంభించారు.

పర్యావరణం పట్ల బాధ్యత..

సుప్రియ అడవులు.. తీరాలు.. వన్యప్రాణులను రక్షిస్తుూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. గ్రీన్ తమిళనాడు మిషన్.. వెట్‌ల్యాండ్స్ మిషన్.. క్లైమేట్ చేంజ్ మిషన్ ద్వారా 10.8 కోట్ల చెట్లు నాటింది. 3,600 హెక్టార్ల మాంగ్రోవ్‌లను పునరుద్ధరించింది. 2021-2023 మధ్య ఫారెస్ట్ కవర్‌ను దాదాపు 1,000 చదరపు కిలోమీటర్లు పెంచింది. 7,000 హెక్టార్లను రిజర్వ్ ఫారెస్ట్‌లుగా ప్రకటించింది. 19 కొత్త రాంసర్ వెట్‌ల్యాండ్స్.. భారత్ తొలి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్.. స్లెండర్ లోరిస్ సాంక్చురీని ఏర్పాటు చేసింది పర్యావరణం పట్ల తన బాధ్యతను చాటిచెప్పింది. అందుకే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ కాగలిగింది.

Next Story