ఆన్‌లైన్ మల్టీటాస్కింగ్‌తో తగ్గుతున్న ప్రొడక్టివిటీ.. మెదడు సామర్థ్యంపైనా ఎఫెక్ట్!

by Javid Pasha |

మెదడు రెండు పనులు ఒకేసారి చేయలేదు. బదులుగా టాస్క్‌ల‌ను త్వరగా పూర్తి చేసే క్రమంలో ‘టాస్క్ స్విచింగ్’ ఏర్పడుతుంది.

ఆన్‌లైన్ మల్టీటాస్కింగ్‌తో తగ్గుతున్న ప్రొడక్టివిటీ.. మెదడు సామర్థ్యంపైనా ఎఫెక్ట్!
X

దిశ, ఫీచర్స్ : లంచ్ చేద్దామని జస్ట్ అప్పుడే బాక్స్ ఓపెన్ చేసింది నీలిమ. తింటూ ఉండగా మధ్యలో మొబైల్‌ నోటిఫికేషన్ సౌండ్ వినిపించింది. అంతే ఇక.. ఇటు తింటూనే.. అటు ఫోన్‌చెక్ చేస్తోంది. అవతలి వ్యక్తి మెసేజ్‌లకు రిప్లయ్ ఇస్తూనే లంచ్ పూర్తి చేసింది. రవికిరణ్ ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. పనిలో భాగంగా మెయిల్ చెక్ చేస్తున్నాడు. అయితే ఓ పక్క డెస్క్‌టాప్‌లో మెయిల్ చదువుతూనే.. మధ్య మధ్యలో మౌస్ పక్కనున్న స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నాడు. బ్యాంక్ ఉద్యోగి అయిన సరయూ కూడా అంతే.. ఓ వైపు ఫోన్‌లో మాట్లాడుకుంటూనే వర్క్ చేస్తోంది. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు ఇటీవల అనేకమంది ఇలాంటి మల్టీ టాస్కింగ్ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ప్రతీ కార్యాలయంలో ఒక్కరిద్దరైనా ఇలాంటివారు తారసపడుతుంటారు. కానీ ఇది డేంజర్ అంటున్నారు నిపుణులు. ఒకేసారి రెండుమూడు పనులపై ఫోకస్ చేయడం, పూర్తి చేయడం వంటి చర్యలు మనలో నిజమైన పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, ప్రొడక్టివిటీని తగ్గిస్తుందని అంటున్నారు.

డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మల్టీటాస్కింగ్ సాధారణమే అంటుంటారు కొందరు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ అదే కంటిన్యూ అవుతుంటే మీ హెల్త్ రిస్క్‌లో పడుతుంది. ఎందుకంటే.. మెదడు రెండు పనులు ఒకేసారి చేయలేదు. బదులుగా టాస్క్‌ల‌ను త్వరగా పూర్తి చేసే క్రమంలో ‘టాస్క్ స్విచింగ్’ ఏర్పడుతుంది. అంటే ఒక పని నుంచి మరో పనికి వెంటనే మారుతుంటారు. దీనివల్ల ‘స్విచింగ్ కాస్ట్’ అనే నష్టం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతీ పని సమయంలో మెదడుకు అదనపు శ్రమ పడుతుంది. ఒక పని నుంచి మరో పనికి మారడం వల్ల తిరిగి ఫోకస్ చేయడానికి సగటున 23 నిమిషాలు పడుతుంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వర్క్‌లో తప్పులు దొర్లుతాయి. ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అందుకే మల్టీ టాస్కింగ్ వద్దంటున్నారు మానసిక నిపుణులు.

నష్టాలే ఎక్కువ!

*అధ్యయనాల ప్రకారం కూడా మల్టీ టాస్కింగ్ వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ. మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీ 40% వరకు తగ్గుతుంది. చేస్తున్న పనిలో నాణ్యత కోల్పోవచ్చు.

*మల్టీ టాస్కింగ్ వల్ల పనిమీద దృష్టి పెట్టినా స్థిరత్వం (అటెన్షన్) ఉండదు. వర్కింగ్ మెమరీ, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ బలహీనపడతాయి. మెదడు ఇర్రెలెవెంట్ డిస్ట్రాక్షన్స్‌ను ఫిల్టర్ చేయలేకపోతుంది. దీంతో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లక్షణాలు పెరుగుతాయి.

*దీర్ఘకాలికంగా మెదడు స్ట్రక్చర్‌ మార్పులు (Gray matter reduction) జరిగి కాగ్నిటివ్ డిక్లైన్ రిస్క్ పెరుగుతుంది. లెర్నింగ్, GPA, మెమరీ రిటెన్షన్ ప్రభావితమవుతాయి.

ఏం చేయాలి?

పనుల్లో మల్టీ టాస్కింగ్ వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి మానేయడం మంచిది. కానీ ఈ అలవాటును కొందరు మానుకోలేకపోతారు. అలాంటి వారు మల్టీ టాస్కింగ్ నివారకోసం సింగిల్-టాస్కింగ్ ప్రాక్టీస్ చేయాలంటున్నారు నిపుణులు. ఒకసారి ఒక్క పనిపై మాత్రమే ఫోకస్ చేసి పూర్తి చేయడం ఉత్తమం. అలాగే ఆ పనిచేస్తున్నప్పుడు కూడా ప్రతీ 25 నిమిషాలకు ఒక స్మాల్ బ్రేక్ తీసుకోవాలి. దీంతో మల్టీ టాస్కింగ్ నుంచి బయటపడవచ్చు. అలాగే పరిమితికి మించి స్క్రీన్ వాడకూడదు. డిజిటల్ డిటాక్స్ పాటించాలి. అలాంటి అవకాశం లేనివారు రోజుకు కొంత సమయం స్క్రీన్-ఫ్రీ జోన్ (ఉదా: మీల్స్ సమయం, బెడ్‌టైమ్ ముందు)లో, వీకెండ్‌లో డిజిటల్ బ్రేక్ తీసుకోవాలి. అవసరమైతే ఫోన్లలో, ట్యాబ్లలో నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉపయోగించండి. అవసరమైన యాప్‌లు మాత్రమే ఓపెన్ చేయండి. మెడిటేషన్, యోగా లేదా వాకింగ్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ & ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేయండి.

Next Story