- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంతేవాడలో ఐఏఎస్ నమ్రత ఇన్స్పెక్షన్
దంతేవాడ.. నక్సల్ ప్రభావిత ప్రాంతం.. కానీ ఈ ఐఏఎస్ అధికారిణి మోటార్ సైకిల్పై ఆ ప్రాంతాన్ని చుట్టేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చాలా మంది ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : దంతేవాడ.. నక్సల్ ప్రభావిత ప్రాంతం.. కానీ ఈ ఐఏఎస్ అధికారిణి మోటార్ సైకిల్పై ఆ ప్రాంతాన్ని చుట్టేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చాలా మంది ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. పవర్ ఫుల్ ఆఫీసర్ అని కొనియాడుతున్నారు. అయితే ఈ జర్నీ ఆమెకు కేవలం ఇన్స్పెక్షన్ మాత్రమే కాదు.. తన బాల్యాన్ని.. ఎనిమిది కిలోమీటర్ల స్కూల్ ప్రయాణాన్ని.. యూపీఎస్సీలో AIR 12 సాధించిన ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది.
నమ్రత జైన్.. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలోని చిన్న పట్టణం గీడం నుంచి వచ్చారు. ఈ ప్రాంతం చాలా కాలంగా నక్సల్ ప్రభావిత ప్రాంతం. చాలా సంఘర్షణలతో బాధపడుతోంది. గ్రామానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. అడవుల మధ్యలో వంకర టింకరగా ఉండే రోడ్డు. అయినా సరే నమ్రత నక్సల్ ప్రభావిత ప్రాంతంలో మోటార్ సైకిల్పై వెళ్తూ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పబ్లిక్ సర్వీసులను స్వయంగా పరిశీలిస్తుంది. దీంతో ఒక అధికారి కష్టమైన మార్గాన్ని ఎంచుకుని.. తరచుగా వెలుగులోకి రాని ప్రజల దగ్గరకు వెళ్లడం.. ఆన్లైన్ అటెన్షన్ క్యాచ్ చేసింది. కానీ నమ్రతకు మాత్రం ఇది సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇస్తుంది.
గీడం నుంచి UPSC ర్యాంక్ వరకు
నమ్రత జైన్ ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా గీడం అనే చిన్న పట్టణం నుంచి వచ్చారు. ఇక్కడ స్కూళ్లు, ఆరోగ్యం, రోడ్లు.. ఏవీ సరిగ్గా లేవు. దీంతో ఆమె కార్లిలోని నిర్మల్ నికేతన్ స్కూల్లో చదివింది. పదో తరగతి వరకు.. రోజూ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసింది. భవిష్యత్తుపై కలలు కంటూ.. ఉన్నత చదువుల కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లాలన్న నిర్ణయించుకుంది. ఆమె తల్లిదండ్రులు దూరంగా పంపేందుకు సందేహించినా.. అదనపు ఖర్చులు, భద్రతా గురించి ఆందోళ చెందినా.. ఆమె ఒప్పించింది. దుర్గ్లో చదువు కొనసాగించింది. తర్వాత భిలాయ్లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొనసాగించిన యూపీఎస్సీ ప్రయాణంలో మొదటి విజయం సాధించి.. ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరింది. కానీ ఆమె లక్ష్యం ఐఏఎస్. దీంతో అంతటితో ఆగకుండా తన జర్నీ కొనసాగించింది.
ఐఏఎస్ కోసం..
హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతూ ఉండగా.. IAS కోసం సన్నాహాలు కొనసాగించింది. తరగతులు, డ్రిల్స్, శిక్షణ మధ్యలో కూడా సమయం కేటాయించి చదివింది. మొత్తానికి ఆమె సంకల్పం ఫలించింది. 2018లో మూడవ ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 12 సాధించారు. ఈ విజయం ఆమె కోరుకున్న IAS పాత్రకు దగ్గరగా తీసుకెళ్లింది. వ్యవస్థలను మార్చి, గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ సర్వీసులను మెరుగుపరచగల స్థాయికి వెళ్లేలా చేసింది. అత్యంత అవసరమైన చోట.. అభివృద్ధికి బీజాలు వేసింది. ఆమె పర్యవేక్షణలో దూరప్రాంతాల్లో 24 స్కూళ్లు నిర్మించబడ్డాయి. తనలాగే దూరం ప్రయాణం చేసే పిల్లలకు విద్యా అవకాశాలు విస్తరించాయి. ఆరోగ్య సేవలు, అవసరమైన పబ్లిక్ సర్వీసులను మెరుగుపరచడంలో కూడా కీలకపాత్ర పోషించింది.
ప్రయాణం ఎందుకు ముఖ్యం?
ఒక స్కూల్ అక్షరాస్యత రేటును మాత్రమే కాదు.. ఎన్నో జీవితాలను మార్చగలదు. ఒక అంగన్వాడీ పోషకాహార ఫలితాలను మెరుగుపరుచగలదు. నమ్మదగిన ఆరోగ్య సేవలు అందగలవు. ఫైనల్గా నమ్రత జైన్ రిమోట్ గ్రామంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న వైరల్ వీడియో ఒక ఇన్స్పెక్షన్ మాత్రమే కాదు.. ఇది ఒక మహిళ జీవిత ప్రయాణం.. సవాళ్లతో నిండిన ప్రాంతం నుంచి UPSCలో టాప్ ర్యాంక్ సాధించి.. అదే సవాళ్లు ఎదుర్కొంటున్న సమాజానికి సేవ చేయడం. కష్టమైన ప్రాంతం నుంచి ఎదగడం కాదు అదే ప్రాంతానికి తిరిగొచ్చి...దాన్ని మెరుగుపరచడం.






