సోషల్ మీడియాలో లోగోను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు: ఎల్ఐసీ!

by  |
సోషల్ మీడియాలో లోగోను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు: ఎల్ఐసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ సోషల్ మీడియాలో కంపెనీ లోగోను అనధికారికంగా ఉపయోగించే సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఇది వర్తిస్తుందని, వినియోగదారులను ఆకర్షించేందుకు ఎవరైనా ఎల్ఐసీ లోగోను వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేసింది. ప్రజలు కూడా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

కొందరు సర్వీస్ ప్రొవైడర్లు, ఏజెంట్లు, వెబ్‌సైట్, యాప్‌లకు చెందిన వారు ఎల్ఐసీ ట్రేడ్‌మార్క్‌ను వాడి కస్టమర్లను మోసగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పాటు నకిలీ డొమైన్ పేరును కూడా ఉపయోగిస్తున్నట్టు గమనించాం. అలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ఐసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏ ఉద్దేశంలోనైనా ఉల్లంఘించినట్టు మా పరిధిలోకి వస్తే అలాంటి సంఘటనలపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు కంపెనీ వివరించింది. ఎల్ఐసీ బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం మొత్తం సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, ఇతర డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరైనా తప్పుడు సమాచారం అందిస్తే దానికి సంస్థ బాధ్యత వహించదని ఎల్ఐసీ వెల్లడించింది.



Next Story

Most Viewed