ట్విట్టర్ క్షమాపణలు.. సరిపోదన్న భారత్ 

by  |
ట్విట్టర్ క్షమాపణలు.. సరిపోదన్న భారత్ 
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్, లేహ్‌ను చైనాలో భాగంగా చూపినందుకు గానూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుపై ఎంపీ మీనాక్షీ లేఖి నేతృత్వంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమక్షంలో ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు భారత ప్రభుత్వానికి మౌఖికంగా క్షమాపణలు తెలిపారు. ఇందుకు ఏమాత్రం సంతృప్తి చెందని జేపీసీ లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ, లేహ్‌ను చైనాలో భాగంగా చూపడం భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని, ఇది క్రిమినల్ నేరమని తెలిపారు. కావున ఈ తప్పిదాన్ని కేవలం క్షమాపణలతో సరిపెట్టడం సరికాదని, అఫిడవిట్ దాఖలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దీనికి అంగీకరించిన ట్విట్టర్, ప్రభుత్వంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని, దేశంలోని సున్నిత అంశాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు.

కాగా, గతవారం ఓ జర్నలిస్ట్ లడాఖ్‌లోని లేహ్ నుంచి ట్విట్టర్‌‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేస్తుండగా, ఆ ప్రాంతం చైనాకు చెందినదిగా చూపించింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అజయ్ సాహ్నే ఈ నెల 22న ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేకు లేఖ రాశారు. దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగానూ అగౌరవపర్చినా చట్టవిరుద్ధమని హెచ్చరించారు.

Next Story

Most Viewed