వారం రోజులు…37 గంటల 5 నిమిషాలు.. 7 బిల్లులు

by  |
ts-assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ, శాసనసభ స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్ 24న ప్రారంభ‌మైన అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈ నెల 8 వరకు నిర్వహించారు. తొలుత 5వ తేదీవరకు నిర్వహించాలని భావించినప్పటికీ.. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు వాయిదా వేశారు. తిరిగి ఆరోజుల్లో చర్చించాల్సిన అంశాలను మూడు రోజులు ఈ నెల 8వ వరకు నిర్వహించారు. సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగగా.. 37 గంట‌ల 5 నిమిషాల పాటు జ‌రిగాయి. రోజుకు సరాసరి 5 గంటలకు పైగా కొనసాగాయి. మొత్తం 41 మంది స‌భ్యులు ప్రసంగించారు. ఏడు బిల్లులు, ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆరు అంశాల‌పై స‌భ‌లో స్వల్పకాలిక చ‌ర్చ జ‌రిగింది. ఐటీ ఇండస్ట్రీ, హరితహారం, మైనార్టీ సంక్షేమం, పాతబస్తీ అభివృద్ధి, దళితబంధు, పట్టణప్రగతి-పల్లె ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

టీఆర్ఎస్ సభ్యులు సమావేశంలో 9 గంటల 2 నిమిషాలు మాట్లాడగా.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీలు 11గంటల 8 నిమిషాలు మాట్లాడారు. ఇందులో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు 5 గంటల 35 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 గంటల 24 నిమిషాలు, బీజేపీపార్టీ ఎమ్మెల్యేలు 2 గంటల 3 నిమిషాలు మాట్లాడారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు 16 గంటల 55 నిమిషాలు మాట్లాడారు. మొత్తం ఏడు రోజుల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ లో 170 సమస్యలను 41 మంది సభ్యులు లెవనెత్తారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో తెలంగాణ హౌజింగ్ బోర్డు బిల్లు, కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హర్టికల్చరల్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు, నేషన్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లు, రాష్ట్ర పర్యాటకులపై, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తను నివారించే బిల్లు, స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లులను ఆమోదించారు.

మండలిలో…

శాసనమండలి 7 రోజుల పాటు 23 గంటల 32 నిమిషాలు కొనసాగింది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు 13 గంటల 4 నిమిషాలు మాట్లాడగా, టీఆర్ఎస్ సభ్యులు 5 గంటల 5 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు గంట 23 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 2 గంటల 3 నిమిషాలు, పీఆర్టీయూకు చెందిన ఎమ్మెల్సీ 33 నిమిషాలు, నామిటెడ్ ఎమ్మెల్సీలు గంట 24 నిమిషాల పాటు మాట్లాడారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మండలి ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రకటించారు. 7 బిల్లులు ఆమోదం పొందాయి. జీరో ఆవర్ లో 36 సమస్యలను సభ్యులు లెవనెత్తి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 33 మంది సభ్యులు మాట్లాడారు. నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.

వింటర్ సెషన్ కు సిద్ధంగా ఉన్నాం-శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వర్షాకాల సమావేశాలు చాలా అర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సజావుగా జరిగాయని, ప్రజాసమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిబింబించేలా 6 అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలోని కమిటీ హాల్ లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ,విప్ గంప గోవర్ధన్ తో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా జరగడానికి సభ్యులంతా సహకరించారన్నారు. సభా సమయం ఎక్కడా వృథా కాలేదని, వాకౌట్లు, సస్పెన్షన్లు లేవన్నారు. 101 మంది ఉన్న టీఆర్ఎస్ కు 9 గంటల 2 నిమిషాలు, 15 మంది సభ్యులున్న ప్రతిపక్షాలకు 11 గంటల 8 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. సమయం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొనడంలో అర్ధం లేదన్నారు. అంశాలపై చర్చ జరగగా.. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ -1, ఎంఐఎం-1 సబ్జెక్టును తీసుకున్నట్లు తెలిపారు. అధికారపక్షం కంటే విపక్షాలకు ఎక్కువ సమయం ఇచ్చామని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలను ఇతర రూపాల్లో ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని తెలిపారు. మరి కొన్నాళ్ళ పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించారని, కానీ పండగలు ఉన్నాయని సభ్యులు కోరడంతో సభను నిరవధిక వాయిదా వేయడం జరిగిందన్నారు. శీతాకాల సమావేశాల్లో మిగిలిన అన్ని అంశాలపై చర్చిస్తామని ప్రకటించారు. ఆ సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు పూర్తి స్థాయిలో సన్నద్దమై రావాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు వంతులు పెట్టుకొని సభలో కూర్చున్నారని అన్నారు. సమావేశాలు ముగించే విషయమై గురువారం సభాపతి అన్ని పక్షాల నేతలతో చర్చించారని వారి అంగీకారం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.


Next Story