దేశ వ్యాప్తంగా భారీగా న్యాయమూర్తుల ఖాళీలు : మణిదీప్

by  |
Law student Manideep
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన లా విద్యార్థి, హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ మణిదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారీగా న్యాయమూర్తుల కొరత ఉందని అన్నారు. సోమవారం ఆయన ‘దిశ’ రిపోర్టర్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని హైకోర్టుల్లో 406 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 64 ఉండగా, తరువాత స్థానంలో కలకత్తా 36, పంజాబ్ హర్యానా కోర్టు 35 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గత 30 ఏండ్లలో ఎప్పుడూ కూడా పూర్తిస్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరగలేదని, వందల సంఖ్యలో ఖాళీలు ఉంటున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపారని అన్నారు.

దేశంలోని పెండింగ్ కేసుల గురించి, అండర్ ట్రయిల్ ఖైదీల గురించి సమాచార చట్టం ద్వారా ప్రశ్నించానని ఆయన వివరించారు. దేశంలో నాలుగు కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. అండర్ ట్రయిల్స్‌గా ఉన్నవారు 3 లక్షలకు పైమాటే అని, ఇందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని అన్నారు. న్యాయమూర్తుల నియామకం పూర్తి స్థాయిలో జరగాలని కోరారు. అంతేగాకుండా.. ప్రస్తుతం సుప్రీంకోర్టులోనూ కనీస మౌలిక వసతులు లేక అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. దేశంలో ఉన్న అనేక కోర్టుల్లో కనీసం టాయిలెట్ సదుపాయాలు కూడా లేవన్నారు. దీనివల్ల న్యాయవాదులు, బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసుల వల్ల జైల్లో మగ్గుతున్న వారిని బయటకు తీసుకురావాలంటే న్యాయమూర్తుల నియామకం వెంటనే చేపట్టాలని అన్నారు. ప్రజల్లో చట్టాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.


Next Story

Most Viewed