ప్లాస్టిక్ కారణంగా పక్షుల్లో అరుదైన వ్యాధి.. గుర్తించిన శాస్త్రవేత్తలు

by Disha Web |
ప్లాస్టిక్ కారణంగా పక్షుల్లో అరుదైన వ్యాధి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: పక్షుల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే సరికొత్త వ్యాధిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ నిరంతర వినియోగం వల్ల వాటి జీర్ణవ్యవస్థలో గాయంతో కూడిన కణజాలాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది దీర్ఘకాలిక మంటతో పాటు తీవ్రంగా హాని కలిగిస్తుందని తెలిపారు. కడుపు కణజాలంపై తొలిసారి అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా, బ్రిటన్‌ పరిశోధకులు.. పర్యావరణంలో ప్లాస్టిక్ వల్ల ఏర్పడిందని స్పష్టం చేసేందుకు ‘ఫైబ్రోటిక్’ వ్యాధికి ‘ప్లాస్టికోసిస్’ అని పేరు పెట్టారు.

ఆస్ట్రేలియాలోని లార్డ్ హోవ్ ద్వీపంలో ఇటీవల మరణించిన 80 నుంచి 90 రోజుల మధ్య వయసున్న 21 పిల్లలతో సహా 30 ఫ్లెష్-ఫూటెడ్ షీర్‌వాటర్ పక్షులపై రీసెర్చ్ చేశారు శాస్త్రవేత్తలు. వీటిని నిశితంగా పరిశీలించిన వారు.. పక్షుల శరీరంలో మైక్రోప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ఒక పక్షి శరీర బరువులో 12.5 శాతం ప్లాస్టిక్‌ ఉన్నట్లు తెలిపారు. పక్షి ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ని తీసుకుంటే.. కణజాలంపై అంత గాయాలు, మచ్చలు ఏర్పడుతున్నాయని నిర్ధారించారు. ఇది క్రమంగా ప్రోవెంట్రిక్యులస్‌లో ట్యూబులర్ గ్లాండ్ విచ్ఛిన్నానికి దారితీస్తుందని, ఈ గ్రంధులను కోల్పోవడం వల్ల ఇన్ఫెక్షన్‌కు లోనవుతూ, పరాన్నజీవులకు మరింత హాని కలిగిస్తాయని అన్నారు. ఆహారాన్ని జీర్ణం చేసే విటమిన్లను గ్రహించే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయన్నారు. ఇక ఈ వ్యాధికి గురైన పక్షులు బయటకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. అంతర్గతంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ విధంగా కడుపు కణజాలంపై పరిశోధన చేయడం ఇదే మొదటిసారి.

Next Story