వామన్‌రావు కేసులో ఆడియో ‘లీక్‌’పై సరికొత్త చర్చ.. కేసు క్లోజ్ చేస్తారా..?

by  |
వామన్‌రావు కేసులో ఆడియో ‘లీక్‌’పై సరికొత్త చర్చ.. కేసు క్లోజ్ చేస్తారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో లీకైన ఓ ఆడియోపై సరికొత్త చర్చ సాగుతోంది. పోలీసులు నిందితుల కన్ఫెషన్ రిపోర్ట్‌లో.. తాగిన మైకంలో వారు హత్య చేశారని నిర్దారించారు. ఈ మేరకు గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ కూడా మంథనిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదే ప్రకటించారు. ఈ మర్డర్ కేసు దర్యాప్తును స్పెషల్ టీములు సిస్టమెటిక్‌గా చేసిన తరువాత ఆడియో లీకు కావడంతో తప్పుదారి పట్టించినట్టయిందని ఏసీపీ వివరించారు.

అలాగే వారిద్దరూ తాగిన మైకంలో మాట్లాడుకున్నారని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుండగా, డీసీపీ స్థాయి అధికారి విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు వామన్‌రావు మర్డర్ తరువాత వెలుగులోకి వచ్చిన వీడియోలు, సుందిళ్ల బ్యారేజ్‌లో స్వాధీనం చేసుకున్న కత్తులను ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పోతారం సర్పంచ్ భర్త సదానందం, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ భర్త మూల పురుషోత్తమ్ రెడ్డిలు మాట్లాడినట్టుగా నిర్దారించిన పోలీసులు వారిద్దరిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. తాగిన మైకంలోనే మాట్లాడుకున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఏసీపీ ప్రకటించారు.

అయితే.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వామన్‌రావు మర్డర్ కేసులో అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. సదానందం, పురుషోత్తమ్ రెడ్డిలు మాట్లాడుకున్న ఆడియో కేసును ఇంతటితో వదిలేస్తారా లేక లోతుగా పరిశోధన చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ప్రతీ అంశాన్ని వదిలిపెట్టకుండా సూక్ష దృష్టితో ఆరా తీస్తున్న పోలీసులు ఈ సంభాషణకు సంబంధించిన ఆడియోను కూడా సైంటిఫిక్ పరీక్షలకు పంపిస్తారా లేదా అనే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ కూడా విచారణలో తేలినట్టు.. తాగి ఉన్నారా లేదా అనేది తేల్చేందుకు ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరికీ పంపించి నిర్దారించుకుంటారా అన్నదే మిస్టరీగా మారింది.

ఆ ఆడియో తమదేనని సదానందం, పురుషోత్తమ్ రెడ్డిలు ఒప్పుకున్నందున ఆ సంభాషణల్లో ఉన్న నిజమెంత అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే కోర్టు విచారణలో ఈ ఆడియో అంశం కూడా కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. పెద్దోల్లు ఉన్నారు అన్న మాటతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ వసంతరావుకు ఈ హత్యతో సంబంధం లేదన్న టాపిక్ కూడా ఉన్నందున వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ ఆడియోను సైంటిఫిక్‌గా పరీక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story