నేటి నుంచి నల్లమలలో పెద్దపులుల లెక్కింపు

by  |
నేటి నుంచి నల్లమలలో పెద్దపులుల లెక్కింపు
X

దిశ, అచ్చంపేట : దేశంలోనే రెండో పెద్ద రిజర్వు టైగర్ గా పిలువబడుతున్న అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవుల్లో నేటి నుండి పెద్దపులుల లెక్కింపు చేయనున్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఏటీఆర్ అడవుల్లో 254 బీట్లుగా ఉన్నాయి. అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్లను నాలుగు బ్లాకులుగా విభజన చేశారు. ప్రతి బ్లాక్ లో 2 రిజర్వు అటవీ ప్రాంతాలు ఉన్నాయి.

కార్ని ఫోర్ సైన్స్ సర్వే కు 7 రోజులు ..

నేటి నుండి ఏడు రోజుల పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ ఆదేశాల మేరకు అమ్రాబాద్ రిజర్వు అటవీ ప్రాంతంలో జంతువుల లెక్కింపు చర్యలు చేపడుతున్నారు. అందుకు కార్ని ఫోర్ సైన్స్ పేరుతో శాస్త్రీయంగా ఏడు రోజులు సర్వే చేసేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రతి బ్లాక్ లో 30 రోజులు..

అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతాన్ని రెండు డివిజన్లు మరియు 4 బ్లాకులుగా విభజన చేశారు. ముందుగా మన్ననూర్, దోమలపెంట అటవీ క్షేత్రం పరిధిలో సుమారు 30 రోజులపాటు సర్వే చేస్తారు. ఇలా నాలుగు బ్లాకులలో నాలుగు నెలలపాటు సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేలో 7 రోజుల పాటు శాస్త్ర సాంకేతిక సైన్స్ సర్వే కూడా జరుగుతుంది. 254 బీట్ లల్లో ప్రతి బిట్ లో 15 కిలో మీటర్ల చొప్పున సర్వే చేసేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. జనవరిలో సర్వే పూర్తి చేసిన అనంతరం ఫిబ్రవరి నెలలో నేషనల్ టైగర్ సెన్సెస్ అథారిటి న్యూఢిల్లీ వారికి జంతువుల లెక్కింపు డాటా నివేదికను అందజేస్తారు. తిరిగి ఆగస్టు నెలలో ఎన్ టిసిఏ న్యూఢిల్లీ అధికారులు దేశవ్యాప్తంగా పెద్దపులుల సంఖ్యను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో గత ఏడాది జరిపిన లెక్కింపు లో భాగంగా 22 పెద్ద పులులు ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం సుమారు 30 వరకు చేరిందని అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల రెండు ఆడ పెద్ద పులులు గత రెండు మూడు నెలల క్రితం నాలుగు పిల్లలకు జన్మను ఇచ్చినట్లుగా అధికారులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.

750 సీసీ కెమెరాలు ఏర్పాటు..

ప్రతి బ్లాక్లో 750 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మాంసాహార జంతువులైన టైగర్ మానిటరింగ్ పేరుతో పెద్దపులి, చిరుత పులి, రేస్ కుక్కలు, తదితర జంతువుల లెక్కింపు చేయనున్నారు.

లెక్కింపు చేసే ప్రదేశాలు..

అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులుల లెక్కింపు లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు నేటి నుండి మూడు రోజులపాటు నీటి గుంటలు, చెక్ డ్యాములు, నీటి కొలను తదితర ప్రదేశాలతో పాటు మనుషుల కదలిక లేని ప్రదేశాలను, అడవి అంతర్భాగంలోని బండ్ల దారులు, ఫైర్ లైన్స్ ప్రదేశాలలో మాంసాహార జంతువులు లెక్కింపు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు.

ఏర్పాట్లు పూర్తయ్యాయి..

నల్లమల అడవుల్లో పెద్ద పులుల లెక్కింపు గురించి చరవాణి ద్వారా దిశ ప్రతినిధి సోమవారం రాత్రి జిల్లా అటవీ శాఖ అధికారి కిష్ట గౌడ్ ను వివరణ కోరగా.. ఆయన మాట్లాడుతూ అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో జంతువుల లెక్కింపులు చేయుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. నేటి నుండి ఏడు రోజుల పాటు శాస్త్రసాంకేతిక సైన్స్ పద్ధతిలో జంతువుల గుణన లెక్కింపు ఉంటుందని, నాలుగు బ్లాకులుగా విభజన చేశామని, ఒక్కో బ్లాక్ లో 30 రోజుల పాటు సర్వే ఉంటుందని, 254 బీట్ లల్లో 750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి బీట్ లో పదిహేను కిలోమీటర్లు సర్వే ఉంటుందని, నాలుగు నెలలపాటు కొనసాగుతుందని, ఫిబ్రవరి నెలలో సర్వే చేసిన డాటాను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటి వారికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed