వింత ప్రపంచంగా ‘ధరణి’.. మాయమవుతున్న పట్టాదారులు

by  |
వింత ప్రపంచంగా ‘ధరణి’.. మాయమవుతున్న పట్టాదారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ పోర్టల్‎లోకి తొంగి చూస్తే అదో వింత ప్రపంచమే. అద్భుతమని తహసీల్దార్ మొదలు సీఎం కేసీఆర్ వరకు ప్రచారం చేస్తున్నారు. అందులో కనిపించే ఆశ్చర్యానికి గురి అంశాలను మాత్రం గుర్తించడం లేదు. జనం చావు జనానిది అన్నట్లుగా ఉంది. మీరు చచ్చినా హక్కుల కోసం మరో చావే మరి. ప్రతి అంశంలో ఓ వింత కనిపిస్తోంది. ఎవరైనా కొంత భూమిని కొనుగోలు చేస్తే కేటాయించే సర్వే నంబరును చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అన్ని సబ్ డివిజన్లు అయ్యాయా? అని విస్మయానికి గురి చేస్తుంది. ఎక్కడైనా సర్వే నంబరు 1 లో కొంత భూమిని కొనుగోలు చేస్తే దానికి 10 కి పైగా డివిజన్లు చేసి కొత్త నంబరును కేటాయిస్తున్నారు. దాన్ని పలకడం కూడా కష్టమే. ఏ ఒక్కటి చెప్పకపోయినా మరొకరి పేరిట కనిపిస్తుంది. గుర్తు పెట్టుకోవడమూ కష్టమే. గతంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేసినట్లుగా 1, 1, 1, 1, 1, 2, 2, 2, 2 అంటూ కేటాయిస్తున్నారు.

ఆ ర్యాంకులు ఎన్ని వచ్చాయో రెండు, మూడు సార్లు వింటే ఎన్ని ఒకట్‌లో, ఎన్ని రెండ్లో లెక్కించొచ్చు. కానీ ధరణి పోర్టల్ కేటాయించే సర్వే నంబర్లను అంత ఈజీగా చెప్పడమే కష్టంగా మారింది. వారిచ్చే సబ్ డివిజన్లు చూస్తే ఒక్కో సర్వే నంబరు కొన్ని వేల భాగాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. 10 ఎకరాల సర్వే నంబరులోనూ 16 ఒకట్లు పెట్టి సబ్ డివిజన్ కేటాయిస్తుండడంతో కొనుగోలుదార్లు విస్తుపోతున్నారు. ఇక మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్లి ఏదైనా సెర్చ్ చేయాలంటే వాళ్లకే కష్టంగా మారింది. ఏదైనా అప్ లోడ్, డౌన్ లోడ్, సవరణకు దరఖాస్తు చేసుకోవాలంటే పలుమార్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఏ ఒక్క ఒక్కటి తక్కువగా డేటా ఎంట్రీ చేసినా వేరే వారి భూములు దర్శనమిస్తున్నాయి. ఈ సబ్ డివిజన్ల కంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు నంబరును సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఒకటీ రెండు సార్లు చదువుకుంటే నోటికే చెప్పేయ్యొచ్చు. ధరణి పోర్టల్ లో సరికొత్త సర్వే నంబర్ల కేటాయింపు ఎందుకోసమే, ఎవరి కోసమో అర్ధం కావడం లేదు. మెరుగైన రెవెన్యూ పాలనను అందించేందుకు సీఎం కేసీఆర్ తో సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు మూడేండ్లు కష్టపడి సృష్టించిన ధరణి పోర్టల్

అన్ని ప్రాంతాల్లోనూ అంతే

రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో కాదు. అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సబ్ డివిజన్ల కేటాయింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే కాదు. పల్లెల్లోనూ అదే మాదిరిగా సర్వే నంబర్లను విభజిస్తున్నారు. ఎక్కడైనా సర్వే 100 లో కొంత కొనుగోలు చేస్తే దానికి బై ఒకటి అని యాడ్ చేస్తారు. కానీ ఏకంగా 6 నుంచి 16 ఒకట్ల వరకు ఎందుకు కేటాయిస్తున్నారు. ఇదెందుకో అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్.. ఇలా ప్రతి జిల్లాల్లోనూ వింత ప్రపంచంలోకి తొంగి చూడొచ్చు. ఇప్పటి వరకు ఏ రైతునడిగినా.. తన భూమి ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉందని అడిగితే ఠక్కున చెప్పేసేవారు. ఇప్పుడా విధానానికి ధరణి పోర్టల్ చెక్ పెట్టేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే వారెవరికైనా వారి భూములు ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉన్నదన్న విషయాన్ని చెప్పాలంటే ఓ ఎగ్జామ్స్ పాస్ కావాల్సిందే. సాంకేతిక దన్ను కలిగిన ఈ ధరణి పోర్టల్​లో ఈ విధానమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎక్కడైనా సులభతర పాలన ఉంటుంది. ఇక్కడేమో గందరగోళం సృష్టిస్తున్నారు. సర్వే నంబర్లకు సబ్​డివిజన్లను కేటాయించే విధానంలో ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో రెవెన్యూ అధికారులకే తెలియడం లేదు.

కొన్ని ఉదాహరణలు

= మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో సర్వే నంబరు 433 చూస్తే చాలు. వింత ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు. ఒకటీ రెండు కాదు. పదుల సంఖ్యలో సబ్ డివిజన్లకు 6 నుంచి 10 వరకు బై 1 అంటూ వేశారు.

= వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోనూ సర్వే నంబరు 759 లో భూములను కొనుగోలు చేసినోళ్లకు 8 నుంచి 14 ఒకట్లు వేశారు.

= రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో సర్వే నం.66లో కొనుగోలు చేసిన వారికి ఐదు నుంచి 16 ఒకట్లు వేశారు.
= దాదాపు కొత్తగా కొనుగోలు చేసిన వారందరికీ ఇలాంటి సర్వే నంబర్లనే కేటాయిస్తున్నారు.

అజ్ఞాత వ్యక్తులకు ఖాతాలు

ధరణి పోర్టల్​లో రైతుల భూములను తొలగించి కొత్త, అజ్ఞాత వ్యక్తుల పేరిట రాసేస్తున్నారు. వింత పేర్లు, సరికొత్త ఖాతా నంబర్లతో పట్టాదారు పాసు పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఆధార్​నంబర్లు లేవు.. ఆ వ్యక్తులెవరూ ప్రపంచంలోనే లేరు. రైతుల హక్కుల హరించి భూములను హస్తగతం చేస్తున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్​జిల్లా మహబూబాబాద్​మండలం పర్వతగిరి అనే గ్రామంలో శ్రీ అనే పేరుతో ఖాతా నంబరు 11111 ను సృష్టించారు. ఏకంగా 85 సర్వే నంబర్లలోని భూమిని శ్రీ పేరిట ఏకంగా 60 ఎకరాలను రాసిచ్చారు. వారెవరూ ఆ ఊరిలో లేరు. అంత కంటే భూమ్మీదనే లేరు. అవేమీ ప్రభుత్వ భూములు కూడా కాదు. అన్నీ పట్టా భూములే. మెట్ట పంటలే అధికంగా ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలను వింత పేర్లతో నమోదు చేశారు. వీటిని సరి చేసుకోవడానికి ధరణి పోర్టల్​ఆప్షన్లు కూడా ఇవ్వలేదు. పైగా కంప్యూటర్ ఆపరేటర్లు ఉద్దేశ్యపూర్వకంగా కొందరి పేర్లతో ఉన్న భూములపై వివాదాలను సృష్టించేందుకు పన్నిన కుట్రగా రైతులు మండిపడుతున్నారు. వాళ్లు తప్పు చేసి ఇప్పుడేమో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేటా అప్ లోడ్​చేయడంలో ఉన్నతాధికారులు ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తలెత్తిన సమస్యలకు వేలాది మంది రైతులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు

Next Story

Most Viewed