ప్రభుత్వ భూముల్లో ‘రియల్’ దందా !

by  |
ప్రభుత్వ భూముల్లో ‘రియల్’ దందా !
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రియల్ ఎస్టేట్‌లో వ్యాపారులు దూసుకెళ్తూ భూములను కబ్జా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వ్యాపారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చేతులు కలిపి ఇష్టానుసారంంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సర్వే నెంబర్‌లలో 2,05,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో వేల ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు రెవెన్యూ అధికారులు వివరిస్తుండటం గమనార్హం. ఈ అక్రమాలపై స్థానికంగా ఫిర్యాదు చేసే వ్యక్తులను మభ్యపెట్టి కబ్జాదారులు తమవైపు మలుపుకుంటుండగా, అధికారులు మాత్రం ఎలాంటి ఫిర్యాదులు రావట్లేదని చేతులు దులుపుకుంటున్నారు.

ప్రభుత్వ భూముల్లోనే వెంచర్లు..
మహేశ్వరం, బాలాపూర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లోని ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నాయకులే కన్నేసారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూమితో పాటు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తుండగా.. హెచ్‌ఎండీఏ, స్థానిక పరిపాలన కార్యాలయం, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇస్తున్నట్లు సమాచారం. బాలాపూర్‌ మండలంలోని మల్లాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని 1/1, 64,65, 23 సర్వే నెంబర్లల్లోని ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలిశాయి. 1/1 సర్వే నెంబర్‌లో 33గుంటల భూమి, 23సర్వే నెంబర్‌లో 23ఎకరాల భూమి, 64, 65 సర్వే నెంబర్‌లోని 15ఎకరాల భూమిలో వెంచర్లు ఏర్పాటు చేశారు.

కోట్ల విలువైన భూములు మాయం
ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతోనే రూ.కోట్ల విలువైన భూములు కనుమరుగైతున్నాయి. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అధికార పక్షం వైపు ఉంటూ తమ పలుకుబడితో ప్రభుత్వ, ఎఫ్‌టీఎల్‌ భూములను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జాలు చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.



Next Story