రెవెన్యూ అధికారుల లీలలు.. రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్ ల్యాండ్ దందా

by  |
రెవెన్యూ అధికారుల లీలలు.. రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్ ల్యాండ్ దందా
X

దిశ, గోదావరిఖని : భూ మాయలకు అంతు లేకుండా పోతోంది. ఎక్కడైనా గ్రామం ఆభివృద్ది చేసేందుకు పోటీ పడటం సహజం. కానీ పెద్దపల్లి జిల్లాలో గత కొంత కాలంగా భూముల వివాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కొందరు ఖద్దరు చొక్కా నాయకులు రాజకీయ ముసుగు కప్పుకొని భూ అక్రమాలకు పాల్పడటమే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ రంగానికి చెందిన ఓ వ్యక్తి సైతం ఈ భూ అక్రమాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో భూ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. జనగామ శివారు ప్రాంతంలో తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని పవర్ హౌస్ కాలనీకి చెందిన వెంకట నర్సింగ రావు ఫిర్యాదు చేశారు.

దీంతో ఓ రంగానికి చెందిన వ్యక్తితో పాటు రామగుండంకు చెందిన ఓ ఎమ్మార్వోపై 468, 420, 448, 427, 506 r/w, 120-బితో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జనగామ శివారు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న భూ అక్రమాలు వివాదాలకు నిలయంగా మారుతున్నాయి. కొంత మంది భూ అక్రమాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామగుండం, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం భూ సమస్యలతో సతమమవుతున్నారు.

రెవెన్యూ అధికారుల లీలలు..

గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో గతంలో రెవెన్యూ అధికారిగా పని చేసిన ఓ అధికారి కొంతమంది నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిసి భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సదురు అధికారి హయంలో జరిగిన సాదా బైనామాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరు చేస్తున్న వరుస ఫిర్యాదులతో ఈ బాగోతం చర్చనీయాంశంగా మారింది. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో పని చేసి బదిలీపై వెళ్లిన ఓ ఇద్దరు అధికారుల పాత్ర భూ అక్రమాలలో కీలకంగా ఉన్నట్లు చర్చలు సాగుతున్నాయి. సదురు అధికారులు రామగుండంకు బదిలీపై వచ్చిన అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సదురు అధికారులు మరో చోట పని చేస్తున్నప్పటికీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కొంత మందితో సత్సబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఖద్దరు చొక్కా ముసుగులో మున్సిపల్ కాంట్రాక్టర్ భూ దందా..

గోదావరిఖని ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఓ ఖద్దరు చొక్కా కాంట్రాక్టర్ జనగామ శివారులోని చైతన్యపురి కాలనీ, రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు విమర్శలున్నాయి. వారితో పాటు మరి కొంత మందికి సైతం దీనిలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా సామాన్యులు ఎక్కడైనా చిన్నగా షెడ్డు వేసుకుంటే కూలగొట్టే అధికారులకు ఈ ప్రభుత్వ భూమి కబ్జా కనపడటం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదురు కాంట్రాక్టర్‌.. ఏ నాయకుడు అధికారంలో ఉంటే వారిని మచ్చిక చేసుకోవడంలో దిట్ట, అంతే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని తన చేతులో పెట్టుకొని ఏలుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మున్సిపల్ కార్యాలయంలో ఏ కాంట్రాక్టర్‌కు సమయానికి బిల్లులు వస్తాయో లేదో తెలియదు కానీ.. సదురు కాంట్రాక్టర్‌కు మాత్రం సమయానికి బిల్లులు వస్తాయని కొంత మంది గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే సదురు కాంట్రాక్టర్‌పై ఎన్నో భూ అక్రమాల ఆరోపణలున్నా పట్టించుకున్న వారే కరువయ్యారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రామగుండం కార్పొరేషన్‌లో సదరు కాంట్రాక్టర్ కొన్ని ఫైళ్లను సైతం తన దగ్గర పెట్టుకున్నట్లు కొంతమంది ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. అసలు పేరు కంటే కార్పోరేషన్‌లో పిలిచే పేరు సదరు కాంట్రాక్టర్‌కు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్‌పై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed