వారికి అండగా ఆ అధికారులు.. సర్వేల పేరుతో మార్చేస్తున్న మ్యాపులు

by  |
వారికి అండగా ఆ అధికారులు..  సర్వేల పేరుతో మార్చేస్తున్న మ్యాపులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అక్రమ కబ్జా దారులకు అండగా నిలుస్తు సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖాధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాసులు ఇస్తే చాలు సర్వేల పేరుతో మ్యాపులను మార్చి అక్రమార్కులను అందలం ఎక్కిస్తున్నారు. ఏకంగా సర్వే మ్యాప్‌లను మార్చి ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారు. ఇందుకోసం సర్వే ల్యాండ్ రికార్డు శాఖకు చెందిన ఒక అధికారి చక్రం తిప్పుతున్నారు. తనకు అనుకులంగా ఉన్న సర్వేయర్లను దగ్గర పెట్టుకొని అక్రమాలకు తెరతీశారు. సదరు అధికారి అక్రమాలు ఒక్క జిల్లా కేంద్రంలోనే వెలుగు చూడటం విశేషం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజేప్పే ప్రయత్నంలో చిక్కిపోయారు. సదరు అధికారిని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేసే యత్నం జరుగగా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ ప్రజా ప్రతినిధి మోకాలడ్డటం విశేషం.

నిజామాబాద్ నగరంలో బోధన్ రోడ్డులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఉంది. దానిలో చేప పిల్లల పెంపకానికి ఫిష్ పాండ్ ఉంది. దాని కోసం ఎకరాల భూమిని కేటాయించారు. అయితే అది ప్రైమ్ ల్యాండ్ కావడంతో చాలా సంవత్సరాలుగా ఫిషరిస్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అక్కడ భూమి ధర కోట్లు పలుకుతుండటంతో కోర్టు వరకు వివాదాలు వెళ్లాయి. గతంలో అధికారులు సర్వేలు చేసి సదరు భూమి మొత్తం మత్స్యశాఖకు చెందినది అని తెల్చిపారేశారు. కానీ ఇటీవల సర్వే ల్యాండ్ రికార్డుల అధికారులు వింత పోకడలతో సర్వే చేశారు. అక్రమార్కుల వెనుక అధికార పార్టి నేతలు ఉండటంతో పాటు కాసులకు కక్కుర్తి పడి మరోసారి సర్వే చేశారు. ఈ సారి సర్వేలో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా తేల్చారు. దానితో సదరు వ్యక్తులు అక్కడ పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. స్థానికులు అక్కడ జరుగుతున్న కబ్జా వ్యవహరంను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దానితో జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు అక్కడ ఏం జరుగుతుందని రహస్యంగా విచారణ జరిపారు. విచారణ నివేదిక అధారంగా ప్రభుత్వ భూమిలో సర్వే చేసి పట్టా భూమిగా ప్రాథమిక నివేదిక ఇచ్చిన సర్వేయర్ పై వేటు వేశారు. కానీ, సదరు శాఖలో కీలక అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లా పాలనాధికారి సదరు అధికారిని ప్రభుత్వంకు సరెండర్ చేసే యోచనలో ఉండాగానే జాగ్రత్త పడ్డాడు ఆ అధికారి. ఏకంగా జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధిని శరణు కోరడంతో జిల్లా పాలనాధికారి చర్యలకు ఆదిలోనే బ్రేక్ పడినట్లు సదరు శాఖలో జోరుగా చర్చలు జరగుతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి మొదలు, జిల్లా అధికారులకు, డివిజన్, మండల స్థాయిలో అధికారులకు ఎక్కువగా భూముల పంచాయతీల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన చేసి, వీఆర్ఓ వ్యవస్థను ప్రక్కన పెట్టి, ధరణి ద్వార రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్నా జిల్లాలో మాత్రం భూముల కబ్జా, సర్వే నంబర్‌ల మార్పుల వ్యవహరం జిల్లా అధికార యంత్రాంగంకు తల నొప్పులను తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం భూముల పంచాయతీ అంతా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖపైకే మల్లాయి. అలాంటి సమయంలో కోట్ల రూపాయల విలువ చేసే సర్కారు భూమిని పట్టా భూమిగా చేసిన వ్యవహరంలో సర్వేయర్ పై వేటు వేసిన అధికార యంత్రాంగం‌పైన అదేశాలు ఇచ్చి అక్రమార్కుల వెంట ఉన్నవారిపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు షూరు అయ్యాయి. సర్వేశాఖ అధికారుల చేతి వాటం కారణంగానే భూపంచాయతీలు జరుగుతున్నట్టు కలెక్టర్ గుర్తించి ఆ శాఖాధికారిని సరెండర్ చేయ్యాలని సంకల్పించిన అధికార పార్టీ నేత అడ్డుకోవడంతో జిల్లా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వేయర్ పై వేటు వేసి అసలు సూత్రదారిపై చర్యలు తీసుకోకపోతే వారు మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టి నేతలు అక్రమార్కుల వెంటే ఉన్నారనడానికి సర్కారు భూమిని పట్టా భూమిగా మార్చే యత్నంను ఇప్పుడు అందరు ఉదహరిస్తున్నారు.

Next Story

Most Viewed