కోట్లు విలువ చేసే భూమిపై కన్ను…

by  |
land
X

దిశ, కూకట్​పల్లి: బాలానగర్​ మండల పరిధిలో రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారుల మధ్య సమన్వయ లోపంతో భూ కబ్జాకోరులకు కాసులు కురుపిస్తున్నాయి. కూకట్​పల్లి సర్కిల్ పరిధిలో​ ఓల్డ్​ బోయిన్​పల్లి హస్మత్​ పేట్​లో కోట్లు విలువ చేసే సుమారు రెండు వేల గజాల పైగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. బోయిన్​ చెరువుకు ఆనుకుని బఫర్​ జోన్​లో ధోభీ ఘాట్​కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్​ 57 లోని విలువైన భూమిని కొందరు రాత్రికి రాత్రే మట్టితో నింపి కబ్జా చేసి గదులను నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా ప్రహరిని కూల్చివేశారు.

సర్వే నంబర్​లపై అవగాహన ఎక్కడ…?

చెరువు బఫర్​ జోన్​లో మట్టి పోసి ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడుతుంటే ఇరిగేషన్​ అధికారులు నోటి మాటన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చి వేశారు. ఇదిలా ఉంటే నిర్మాణాలు జరిగిన చెరువు బఫర్​ జోన్ భూమి​ సర్వేనెంబర్​ 109 కి సంబంధించిందని ఇరిగేషన్​ అధికారులు చెబుతున్నారు. కాగా నిర్మాణాలు చోటు చేసుకున్న భూమి సర్వే నెంబర్​ 57 కు సంబంధించిన భూమిగా రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు.

విభాగాల మధ్య సమన్వయ లోపం…

బాలానగర్​ మండల పరిధిలోని సర్వే నెంబర్​ 17 లో 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బోయిన్​ చెరువు కబ్జాకు గురై 50 ఎకరాలు మాత్రమే మిగిలింది. చెరువు ఆనుకుని ఉన్న వారు ఇప్పటికే ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వం చొరవతో చెరువు సుందరీకరణ పనులను చేపట్టి చెరువుకు హద్దులు ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ వాకింగ్​ ట్రాక్​ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కబ్జా బారిన పడిన చెరువు కాపాడవలసిన ఇరిగేషన్​, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో చెరువు పూర్తిగా కబ్జా బారిన పడే అవకాశం లేకపోలేదు.

పూర్తి స్థాయిలో కూల్చివేస్తాం: తహసీల్దార్ ప్రవీణ్​ కుమార్​ రెడ్డి దీనిపై స్పందించారు. సర్వే నెంబర్​ 57 లో నిర్మాణాలు చేపడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేయడం జరిగిందన్నారు. అక్రమంగా నిర్మించి ఉన్న గదులను పూర్తి స్థాయిలో కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story