అరుదైన రికార్డుకు చేరువలో ఎల్‌ రమణ

by  |
అరుదైన రికార్డుకు చేరువలో ఎల్‌ రమణ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆయన ముచ్చటగా మూడో సభలో అడుగుపెట్టబోతున్న అరుదైన రికార్డు సొంతం చేసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎల్ రమణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఆయన గెలిస్తే మూడో సభలో అడుగు పెట్టిన నేతగా అరుదైన రికార్డు అందుకోనున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఎల్ రమణ, ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన రమణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డారు. చాలా కాలంగా చట్ట సభలకు ఎన్నిక కాకుండా ఉన్న ఆయన ఇంతకాలం టీడీపీలో క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా బాధ్యతలు చేపట్టిన రమణ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ రమణకు అవకాశం ఇవ్వడంతో ఆయన గెలిస్తే మండలిలో అడుగు పెట్టనున్నారు. భారత చట్ట సభల్లో కీలకమైనవి రాజ్యసభ, లోకసభ, రాష్ట్ర స్థాయిలో విధానసభ, విధాన పరిషత్‌లు ఉంటాయి. ఇందులో ఒక్క రాజ్యసభ మినహా మిగతా మూడు సభల్లో అడుగుపెట్టిన నేతగా అరుదైన రికార్డు పొందబోతున్నారు. ఈ రికార్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందుకునే తొలి వ్యక్తి ఈయన కానున్నారు. సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ రాజ్యసభకు, విధానసభకు, మండలికి ఎన్నికయ్యారు. ఉత్తర తెలంగాణలో మాత్రం డీఎస్ తరువాత రమణే ఈ రికార్డును అందుకోనున్నారు.



Next Story

Most Viewed