ఆ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న కుమార మంగళం బిర్లా..

by  |
kumara-mangamlam
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవుల నుంచి కుమార మంగళం బిర్లా వైదొలిగారు. ఈ మేరకు కుమార మంగళం బిర్లా రెండు పదవుల నుంచి వైదొలగేందుకు కంపెనీ బోర్డు అంగీకరించినట్టు వీఐఎల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. బుధవారం(ఆగష్టు 4) సాయంత్రం తర్వాత నుంచే ఈ నిర్ణయం అమలవుతుందని, తదుపరి సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హిమాన్షు కపానియా బిర్లా స్థానంలో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ తెలిపింది.

ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాన్షు కపానియా టెలికాం పరిశ్రమలో 25 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారని, అంతర్జాతీయ కంపెనీల బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీగా సుశీల్ అగర్వాల్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించినట్టు కంపెనీ వెల్లడించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వీఐల్ సంస్థ రూ. 50 వేల కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది.

ఇటీవల సుప్రీంకోర్టు ఈ బకాయిల తిరిగి లెక్కింపు జరగదని స్పష్టం చేయడంతో కంపెనీ మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కుమార మంగళం బిర్లా సంస్థలో తన 27 శాతం వాటాను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్ చెల్లింపుల వంటి సవాళ్ల నుంచి కంపెనీ బయటపడేందుకు ప్రభుత్వం మద్దతు తప్పనిసరి అని, లేదంటే కోలుకోలేని స్థాయిలో కంపెనీ పతనమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed