పేద విద్యార్థుల భవిష్యత్తు బాధ్యత ఉపాధ్యాయులదే

by  |
teacher Parimala Narasimhulu
X

దిశ, కూకట్‌పల్లి: లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్​ఏపీజే అబ్దుల్​కలాం జయంతి సందర్భంగా 2021 బెస్ట్ టీచర్స్ అవార్డులు అందజేశారు. ఈ అవార్డుకు కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పర్మగళ్ల నరసింహులు ఎంపికయ్యారు. సోమవారం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుదర్శనా చార్యల చేతుల మీదుగా నర్సింహులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. బోధన, తరగతి సామర్థ్యాల సాధన కోసం కృషి చేయడంతో పాటు, జిల్లా, రాష్ట్రస్థాయి ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణలకు రిసోర్స్ పర్సన్‌గా, జిల్లా, రాష్ట్రస్థాయి ఉమ్మడి పరీక్షా పత్రాల తయారీలో నర్సింహులు సభ్యులుగా ఉన్నారని అన్నారు.

విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల అభ్యాసన అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు దాతలచే ఆర్థిక సహాయం అందిస్తూ చేయూతను అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నర్సింహులు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని, విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు, చేయూతను ఎప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నేషనల్​బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్న నర్సింహులును మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్​గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు శర్మ, మండల అసోసియేట్​అధ్యక్షుడు ఎండి.యాసీన్, జిల్లా పరిషత్​పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్​రెడ్డి, తదితర ఉపాధ్యాయులు అభినందించారు.

Next Story