బీసీసీఐకి కేటీఆర్ ఆఫర్..

by  |
బీసీసీఐకి కేటీఆర్ ఆఫర్..
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ కోసం ఐదు వేదికలను ప్రాథమికంగా నిర్దారించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ నిబంధనలు అమలులో ఉండటంతో కేవలం 5 నగరాలనే బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్ చండీగర్ స్టేడియంలను ఈ లిస్టు నుంచి తప్పించారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంపై కూడా ఇంకా సందిగ్దత నెలకొని ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతులు ఇస్తే వాంఖడేలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. గత ఏడాది యూఏఈకి తరలించడంతో మ్యాచ్‌లు జరగలేదని.. ఈ సారి హైదరాబాద్ వేదికను తప్పించడంతో వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్ చూసే అవకాశం కోల్పోయామని సన్‌రైజర్స్ అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీసీసీఐకి కేటీఆర్ ట్వీట్..

ఐపీఎల్ వేదికల షార్ట్ లిస్ట్‌లో హైదరాబాద్ పేరు లేకపోవడంతో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేస్తూ ఆదివారం ఒక ట్వీట్ చేశారు. కరోనా బూచి చూపించి హైదరాబాద్‌ను తప్పించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్ 19 నియంత్రణలో అన్ని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్ ఎంతో ముందున్నదని కేటీఆర్ తెలిపారు. ఐపీఎల్‌ను ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించాలని. అందుకు అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తామని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్న కేటీఆర్ స్వయంగా బీసీసీఐని కోరడంతో.. ఇది ప్రభుత్వ నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రభుత్వమే సహకరిస్తామని పేర్కొనడంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.

ఫుల్ జోష్‌లో అభిమానులు..

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవని బాధపడుతున్న అభిమానులు కేటీఆర్ ట్వీట్‌తో ఒక్కసారిగా జోష్ లోకి వెళ్లిపోయారు. బీసీసీఐ తప్పకుండా మంత్రి కేటీఆర్ విజ్క్షప్తిని పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు అడ్డుకుంటామని ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడం.. అదే ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ ఉప్పల్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని ఏకంగా బీసీసీఐని కోరడంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌లు అడ్డుకుంటామని ఎమ్మెల్యే చెప్పడం వల్లే బీసీసీఐ కూడా హైదరాబాద్‌ను ఎంపిక చేయలేదని అభిమానులు అంటున్నారు. కరోనా సాకుగా చూపించి ఐపీఎల్‌ను వేరే వేదికకు తరలించారని వాళ్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు కూడా సరిగా లేదు. ఉప్పల్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల హెచ్‌సీఏకు కూడా ఆదాయం లభిస్తుంది. కానీ ప్రస్తుతం అసోసియేషన్‌లో అంతర్గత గొడవల కారణంగా ఐపీఎల్ నిర్వహణపై ఎవరూ శ్రద్ద చూపడం లేదు. బీసీసీఐ మ్యాచ్‌లు తరలించడానికి ఇది కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. ముంబయిలో మ్యాచ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతులు మంజూరు చేయకపోతే.. బీసీసీఐ తర్వాత ఆప్షన్‌గా హైదరాబాద్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Next Story

Most Viewed