దేశానికి ఆ విషయంలో తెలంగాణ క్యాపిటల్ సిటీగా మారబోతుంది.. కేటీఆర్

by  |
ktr
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి/అమీన్ పూర్: తెలంగాణ అన్ని రకాల వైద్య పరికరాలు తయారయ్యే మెడికల్ డివైజ్ హబ్‌గా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా క్లస్టర్, శామీర్ పేట సమీపంలో జీనోమ్ వ్యాలీ, సుల్తాన్ పూర్‌లో మెడికల్ డివైజ్ పార్క్‌లు ఏర్పాటు అయితున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచానికి సరఫరా అవుతున్న వివిధ రకాల వ్యాక్సిన్‌లలో 35 శాతం తెలంగాణలోని హైదరాబాద్ లోనే తయారు కావడం గొప్ప విషయం అన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తున్నామని చెప్పారు.

పరిశ్రమల స్థాపన‌తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తెలంగాణ దేశానికి లైఫ్ సైన్స్లో క్యాపిటల్ సిటీగా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీలను ప్రారంభించారు. రూ. 265 కోట్లపెట్టుబడితో ఏర్పాటు అయిన ఈ కంపెనీలతో 1300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని స్పష్టం చేశారు. 50 కంపెనీల కోసం మెడికల్ డివైజ్ పార్క్ లో స్థలం అందుబాటులో ఉన్నదని, ఇప్పటికే ఇందులో ఏర్పాటైన 7 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజు 7 కంపెనీలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.

78 శాతం ఔషధాలు, వైద్య పరికరాలు తెలంగాణలోనే తయారు అవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. 4 ఏళ్ల క్రితం రాళ్ళు తప్పలతో కూడి ఉన్న సుల్తాన్ పూర్ ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా మారిపోయిందని చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టంట్స్ తయారీ పరిశ్రమను ఏప్రిల్‌లో ప్రారభించుకుంటామన్నారు. ఇక్కడి పరిశ్రమల స్థాపనతో 7 వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మండలి ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed