ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు కోసం కేటీఆర్..!!

by  |
ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు కోసం కేటీఆర్..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వాణిదేవిని గెలిపించడం కంటే ఆమెను ఓడించడం కోసమే మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారంట. వాణిదేవి గెలవడం ఆయనకు ఇష్టం లేదంట. ఇందుకోసం అసదుద్దీన్ ఒవైసీ సాయాన్ని కూడా తీసుకుంటున్నారంట. ఇవి ఊహాగానాలు కావు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ రెండువర్గాలుగా విడిపోయిందని ఆరోపించారు. అసదుద్దీన్, కేటీఆర్‌లు ఇద్దరూ కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపుకోసం కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరో ఇద్దరు మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం వాణిదేవి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోడానికే బీజేపీని టార్గెట్‌గా చేస్తూ కేటీఆర్ ఈ మధ్య విమర్శలు చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. బ్రాహ్మణుల మీద నిజంగా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన వంద కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు చేయలేకపోయిందని ప్రశ్నించారు. నిజంగా ఆ సామాజికవర్గంపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే మంత్రివర్గంలోకి ఆ సామాజికవర్గానికి చెందినవారిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బ్రాహ్మణులు ఎదగడం ఇష్టంలేకనే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపించారు.

వంచించటం, మోసం చేయటంలో కేసీఆర్‌ను మించినోళ్ళు ఉండరని ప్రభాకర్ ఆరోపించారు. న్యాయవాదులు, జర్నలిస్టులపై కేటీఆర్ చేస్తున్న కామెంట్లన్నీ సవతి తల్లి ప్రేమేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే ప్రగతి భవన్‌లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీస్తామని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.


Next Story