కేటీఆర్ దత్తత కాలనీలో హత్యాచారం.. అయినా స్పందించరేం..?

by  |
Singareni colony
X

దిశ, తెలంగాణ బ్యూరో : సైదాబాద్‌లోని సింగరేణి కాలనీని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారు. కాలనీలో మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఆ కాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. ఆరేళ్ల పాపపై అత్యాచారం, హత్య జరిగి ఆరురోజులైనా కనీసం కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు కేటీఆర్. దీంతో ప్రజలంతా అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రులంతా కొన్ని కాలనీలను దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ సింగరేణి కాలనీని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఆరేళ్లు గడుస్తుంది. అయినా ఆ కాలనీలో పర్యటించలేదు. ప్రజల బాగుగోలు తెలుసుకోలేదు. ఈ నెల 9న కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగింది. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. అయినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర మంత్రులు పరామర్శించకపోవడం గమనార్హం. దీనికి తోడు దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ కేవలం ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారే తప్పా కుటుంబ సభ్యులను పరామర్శించిన దాఖలాలు లేవు.

ప్రతిపక్షాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీలతో పాటు అన్ని పార్టీలు, మహిళా సంఘాలు సైతం కుటుంబాన్ని పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు భరోసా కల్పించిన దాఖలాలు లేవు. దీంతో సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.


Next Story

Most Viewed