'టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయం'

by  |
టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘తెలంగాణలో లాక్ డౌన్ వచ్చే ప్రసక్తే లేదు.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం… దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంది నిజమే.. రాష్ట్రానికి అదనపు డోసులు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డే టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి… ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది… కాంట్రాక్టు వైద్య సిబ్బంది క్రమబద్దీకరణపై ఆలోచిస్తాం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో సంభాషించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమేనని, తెలంగాణకు అదనంగా వ్యాక్సిన్ డోసులు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అందరూ మాస్కు ధరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన నాయకత్వం పటిమతో రాష్ట్రంలోకి అనేక పెట్టుబడులు వస్తున్నాయని, ఈ సంవత్సరం కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పలు చట్టాలతో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని…రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందన్నారు. ఒక రాష్ట్రం ఫ్యాబ్, సెమీకండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రూ.2 వేల కోట్లతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.

వికారాబాద్లోని అనంతగిరి ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా తయారు చేసేందుకు టూరిస్టు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పని చేస్తామని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ పురపాలికలు కార్పొరేషన్ గా మార్చాలనే ఆలోచన ఉందని, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ లాంటి.. పార్టీలు చేస్తున్న ఆసత్యా ప్రచారాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తామన్నారు.

బెంగాల్ లో ఎన్నికల్లో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలి. నగరంలో 50కిపైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ నుంచి అద్భుతాలు ఆశించినవసరం లేదని, అది కేవలం ఒక సలహా మండలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని, మొదటి దశలో 12751 గ్రామాలకు ఆగస్టు మాసాంతానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతుందని, ఆ తర్వాత నగర ప్రాంతాల్లో కి ఈ ప్రాజెక్టును విస్తరిస్తామన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సుమారు 6 కిలోమీటర్ల భారీ పొడుగుతో ఉందని… రానున్న పది పన్నెండు నెలల్లో పూర్తి అవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్, లింకు రోడ్ల పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 137 రోడ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. దేశంలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక మద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో వ్యవహరించారన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఉంటుందన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయి లాక్డౌన్ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటుపై అది తీసుకొస్తానని బాండ్ పేపర్ పైన హామీ ఇచ్చిన వ్యక్తిని అడగాలని సూచించారు. చైనా దేశంతో పోటీ పడాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉందని, దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్టైల్ పార్క్ లేదా హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

హీరోలా ఉన్నారు.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని ఓ అభిమాని అడిగి ప్రశ్నకు కేటీఆర్ నవ్వుతూ బాలీవుడ్, హాలీవుడ్ అంటూ మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్ అంటూబదిలీచ్చారు. తన ఫేవరెట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ అని, అలాగే జాతి రత్నాలు సినిమా బాగుందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరోనాపై ప్రజలను చైతన్యం చేసే ఒక పాటను తయారు చేస్తా అని చెప్పినందుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇటీవల ఆమోదించిన బడ్జెట్ లో మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లకు నిధులు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. 1530 మంది కాంట్రాక్టు వైద్యులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆలోచిస్తామని, ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేసేలా కృషి చేస్తానని, టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని తెలిపారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి యువ తరాలను ప్రోత్సహించడానికి అప్రెంటీస్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించే అంశంపై ఆలోచిస్తానని, నిజామాబాద్ లో జరుగుతున్న ఐటీ హబ్ డెవలప్ మెంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎంజీబీఎస్ నుంచి పలక్ నామా వరకు కరోనాతో కొంత ఆలస్యమైందని, త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.


Next Story

Most Viewed