చికిత్స పొందుతూ కేటీపీఎస్ కార్మికుడి మృతి

by  |
చికిత్స పొందుతూ కేటీపీఎస్ కార్మికుడి మృతి
X

దిశ‌, ఖ‌మ్మం :
ప్రమాదవశాత్తు కిందపడి తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కేటీపీఎస్‌ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మంగళవారం పాల్వంచలో చోటుచేసుకుంది. పాల్వంచ మండలంలోని బాబూజీ నగర్‌లో నివాస ముంటున్న కాకటి శంకర్ (55) కేటీపీఎస్‌లోని 6వ స్టేజ్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. 2017లో కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మినెంటు చేసే క్రమంలో లిస్టులో శంకర్ పేరు కూడా వచ్చింది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం శంకర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు బయటికి వెళుతుండగా అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో అతని తలకి బలమైన గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు శంకర్‌ను కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం పట్టణానికి రిఫర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారులు నందకుమార్, హిమేష్ కుమార్‌లు ఉన్నారు.

Tags: ktps contract labour died, khammam, palvancha



Next Story