15 నిమిషాల్లోనే ముగిసిన కృష్ణా బోర్డు వెబ్​నార్.. తేలని నీటి లెక్కలు

by  |
Srishailam
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణాలో క్వారీ ఫార్వర్డ్​ (గతంలో వాడుకోకుండా మిగిలిన జలాలు) లెక్క తేల్చాలని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. క్వారీఫార్వర్డ్​ జలాలు కావాలని పట్టుబట్టింది. హైదరాబాద్​లోని జలసౌధలో శుక్రవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం బోర్డు సెక్రెటరీ రాయపురే అధ్యక్షతన నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వెబ్​నార్​తో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ తరుపున ఈఎన్సీ మురళీధర్​రావులు పాల్గొన్నారు.

దీనిలో భాగంగా ముందుగా శ్రీశైలం, నాగార్జున సాగర్​ నీళ్ల వినియోగంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నా రెండు రాష్ట్రాల వాదనలతో పెండింగ్​ పెట్టారు. శ్రీశైలం డెడ్​స్టోరేజీకి వెళ్లిందని, ఈసారి కూడా ఏపీ కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకుందని, దీనిపై తేల్చాలంటూ తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత సమావేశంలో కూడా అదనంగా కేటాయింపులపై ఏపీ స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే గతంలో వాడుకోకుండా మిగిలిన జలాలను తెలంగాణకు కావాలని పేర్కొన్నారు. కానీ వాటిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు వినియోగం, క్వారీ ఫార్వర్డ్​ జలాలపై తెలంగాణ వాదనలను ఏపీ తోసిపుచ్చింది.

ఈ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో వెబ్​నార్​తో స్పష్టత రాదంటూ తెలంగాణ ఈఎన్సీ అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా పరిస్థితులతో కష్టమంటూ బోర్డు చెప్పేందుకు ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. కరోనా ఉన్నా జలాల అంశంలో కృష్ణా బోర్డు సమావేశం కావాల్సిందేనని ఈఎన్సీ మురళీధర్​రావు సూచించారు. వెబ్​నార్​ మీటింగ్​ కావడం, ఏపీ తప్పుడు వాదనలతో తెలంగాణ అసంతృప్తితో వెబ్​నార్​ సమావేశంలో కేవలం 15 నిమిషాల్లో ముగిసింది. తెలంగాణ ఈఎన్సీ సూచనతో ఉగాది తర్వాత రెండు రాష్ట్రాలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.



Next Story