4న కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశం

by  |
4న కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రెండు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో కేఆర్ఎంబీ 12వ సర్వసభ్య సమావేశం గురువారం జరుగనుంది. జలసౌధలో ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబీ ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, సీఈలు హాజరు కానున్నారు. కృష్ణా బోర్డుపై ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను నిర్మించేందుకు జీవో జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ కూడా ఎదురుదాడికి దిగింది. తెలంగాణ ప్రభుత్వమే అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బోర్డు ఇరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు, వివరాలన్నీ అందించాలని తెలంగాణ, ఏపీలకు సూచించింది. గత 11 సర్వసభ్య సమావేశాల్లో ఇదే అజెండా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వడం లేదని నోటీసుల్లో పేర్కొంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు సమావేశం నేపథ్యంలో రెండురోజుల పాటు సమీక్ష నిర్వహించింది. సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవేనని, పాత జీవోలతో బోర్డుకు వివరించాలని ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రానికి నీళ్ల అంశంలో జరిగిన దోపిడీని సమగ్రంగా వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా 2011లో పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలను మరోసారి బయటకు తీయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కాగా ఏపీ ప్రభుత్వం సైతం కొత్త ప్రాజెక్టుల వివరాలు ఇవ్వకుండా వాటిని పాత ప్రాజెక్టులేనని బోర్డుకు వివరించేందుకు సిద్దమైనట్లు సమాచారం. సంగమేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పాతదేనని, దీనికి సంబంధించిన జీవోలను బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ బోర్డుకు అజెండా అంశాలను బుధవారం రాత్రి పంపించారు. ఇంతకు ముందుగానే ఫిర్యాదు చేసినట్టుగా తెలంగాణలోని కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని, కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని, బోర్డు పరిధిని నిర్ణయించాలని, లెఫ్ట్ కెనాల్ పరిధిలో నీటి వాటాలో భారీగా నష్టం జరుగుతుందని, ఈ ఏడాది సర్‌ఫ్లస్ వాటర్‌ను మినహాయించాలని బోర్డుకు అజెండా అంశాలను పంపించారు.

Next Story