ప్రతిపక్షాలు శవాల వద్ద రాజకీయాలు చేయవద్దు: ఎమ్మెల్యే మాధవరం

by  |
ప్రతిపక్షాలు శవాల వద్ద రాజకీయాలు చేయవద్దు: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: శవాలతో రాజకీయాలు చేయడం ప్రతిపక్ష నాయకులకు తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్​లో గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయలు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నారులు మృత్యువాత పడ్డారన్న వార్త వినగానే చలించి పోయానన్నారు. గుంతలో పడిన చిన్నారుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ అధికారుల తరఫున తీసుకోవలసిన అన్నీ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు.

చిన్నారుల శవాలను ఉంచుకుని కొంత మంది ప్రతి పక్ష నాయకులు రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. అభం శుభం తెలియని చిన్నారులు, మంచి భవిష్యత్తు ఉన్న పసి పిల్లలు అకారణంగా మృత్యు వాత పడటం తనని కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు కృషి చేసి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పేద కుటుంబాలకు తన వంతుగా, అలాగే ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, తన సొంత నిధులతో మరో 3 లక్షల రూపాయలు చేర్చి ఒక్కో కుటుంబానికి 8 లక్షల చొప్పున అందించడం జరిగిందని అన్నారు.

చిన్నారులు మృతి చెందిన తర్వాత వరుసగా సెలవులు వచ్చిన కూడా.. వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించడం జరిగిందన్నారు. గత పాలకుల కాలంలోనే హౌసింగ్​ బోర్డు గృహాలను నిర్మించడానికి గుంతలు తవ్వడం జరిగిందన్నారు. గుంతను తవ్విన కాంట్రాక్టర్ ​ఖాళీగా వదిలేయడం, నిర్మాణాలు చేపట్టకపోవడం పై సీబీఐ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్‌బీ కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​రావు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండి గౌసుద్దిన్, కేపీహెచ్​బీ సీఐ కిషన్, అడుసుమల్లి వెంకటేశ్వర్​రావు, శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed