స్కూల్స్, హాస్టల్స్‌లో కొవిడ్ రూల్స్ తప్పనిసరి

by  |
స్కూల్స్, హాస్టల్స్‌లో కొవిడ్ రూల్స్ తప్పనిసరి
X

దిశ‌, వికారాబాద్ : స్కూల్స్, హాస్టల్స్‌లో కొవిడ్ నిబంధనలు కంపల్సరీగా పాటించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్కూల్స్, కాలేజీస్, హాస్టల్స్‌లో శానిటేషన్ చేపట్టాలన్నారు. మరుగుదొడ్లను ప‌రిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి బియ్యం, పప్పులతో సహా పాతవి అన్నింటిని వెనక్కి పంపి కొత్తవి తీసుకోవాలని సూచించారు. హాస్టల్స్‌ను డాక్టర్స్, వైద్య సబ్బంది ప్రతీ వారం సందర్శించి విద్యార్థులకు పరీక్షలు చేయాలని ఆదేశించారు.

ఈ నెల 20 వరకు శానిటేషన్ పూర్తి చేసి, వాటర్ ట్యాంక్‌లు క్లీన్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు 6 ఫీట్ల దూరం‌లో కూర్చునేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల ఇష్టం మేరకే విద్యార్థుల‌ను పాఠశాలకు పంపాలని సూచించారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, జ్వరం, జలుబు, దగ్గు ఉంటే విద్యార్థులను పాఠశాలకు అనుమతించొద్దని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 ఆ పై తరగతులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలోని అధికారులందరూ సమన్వయం‌తో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, కలెక్టరు పౌసుమి బసు, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్‌లు చంద్రయ్య, మోతిలాల్, జిల్లా విద్యాధికారి రేణుక, జిల్లా పంచాయతీ అధికారి రిజ్వాన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమశాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed