రైతులెవరూ భయపడాల్సిన పనిలేదు.. ఎమ్మెల్యే భరోసా

by  |
MLA Prakash Goud
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని 650 ఎకరాల వ్యవసాయ భూమి ఎనిమీ ప్రాపర్టీగా నిషేధిత జాబితాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొత్వాల్‌గూడలో 650 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటున్న 300 మంది రైతులకు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ నుంచి రైతులకు నోటీసులు జారీచేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. గత 60 ఏళ్లుగా భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే, ఇప్పుడు ఆ భూములు మావి కావంటూ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. రైతుల్లో ధైర్యం నింపేందుకు రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళను పిలిపించి భూములకు సంబంధించిన వివరాలను రైతులకు వినిపించారు. అనంతరం ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ… ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన భూములు కొత్వాల్‌కూడాతో పాటు మియాపూర్‌లో కూడా ఉన్నాయన్నారు. ఈ భూముల వివరాలను గతంలోనే కలెక్టర్‌తో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి లేఖల ద్వారా తెలియజేశారని అన్నారు. భూములు పోతాయని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు.

రైతులకు కేంద్ర హోంశాఖ ద్వారా ఇవ్వాల్సిన నోటీసులను కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశామన్నారు. రైతుల పక్షాన ఉండి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. నిషేధిత జాబితాలో చేరడంతో రైతుబంధు, రైతు బీమా పథకాలు కూడా అందడం లేదని పలువురు తమ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై కూడా చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed