కోటక్ మహీంద్రా జీతాల్లో కోత!

by  |
కోటక్ మహీంద్రా జీతాల్లో కోత!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఇప్పటికే అనేక సంస్థలు నష్టాలను తగ్గించే ప్రక్రియను మొదలుపెట్టాయి. పలు వ్యాపార సంస్థలు ఉద్యోగులపై వేటు వేయడం, పై స్థాయి ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలను తీసుకున్నాయి. తాజాగా, ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా కూడా జీతాల కోతను వెల్లడించింది. ఏడాదికి రూ. 25 లక్షలకు పైగా వేతనాన్ని అందుకుంటున్న ఉద్యోగుల సీటీసీలో 10 శాతం కోతను విధించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది మే నెల నుంచి 2021 మే నెల వరకు వర్తించనున్నట్టు బ్యాంకు నోటీసులను జారీ చేసింది. వ్యాపారం స్థిరంగా ఉండటానికే జీతాల మార్పుల నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. 2020-21 ఏడాదికి బ్యాంకు టాప్ మేనేజ్‌మెంట్ తమ వేతనాల్లో 15 శాతం స్వచ్చందంగా ప్రకటించిన కొద్ది రోజుల అనంతరం ఈ తాజా నిర్ణయం వెలువడింది.

మొదట్లో కరోనా వైరస్ వ్యాప్తి 2 లేదా 3 నెలలు మాత్రమే ఉంటుందని భావించామని, కానీ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతుండటంతో జీవితాలతో పాటు, జీవనోపాధి రెండింటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోందని, ఇప్పట్లో తగ్గే సూచనలేమీ కనబడ్డం లేదని కోటక్ గ్రూప్ హెచ్ఆర్ అధికారి సుఖిత్ ఉద్యోగులకు అందించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, కోటక్ మహీంద్రా గ్రూప్ ఇటీవల పీఎం కేర్స్ ఫండ్‌తో పాటు, మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి విరాళ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags: kotak mahindra, coronavirus impact, covid-19, salary cut



Next Story

Most Viewed