ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం హ్యూండాయ్, యాపిల్ కంపెనీల భాగస్వామ్యం!

by  |
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం హ్యూండాయ్, యాపిల్ కంపెనీల భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యూండాయ్ మోటార్, యాపిల్ ఇంక్ కంపెనీలు సంయుక్తంగా అటానమస్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి భాగస్వామ్య ఒప్పందంపై ఈ మార్చిలో సంతకం చేసుకోనున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా అమెరికాలో 2024 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నట్టు అంతర్జాతీయ వార్తా పత్రిక ఆదివారం తెలిపింది. యాపిల్‌తో ముందస్తు చర్చలు జరుపుతున్న హ్యూండాయ్ మోటార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించిన తర్వాత, మరో వార్తా సంస్థ 2027 సమయానికి ఇరు కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ కార్లను జార్జియాలోని కియా మోటార్స్ కర్మాగారంలో నిర్మించాలని, లేదంటే అమెరికాలో కొత్త ప్లాంట్‌లో పెట్టుబడులను పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024లో లక్ష వాహనాలను ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే ప్రణాళికతో 4 లక్షల వాహనాల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉండాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కియా మోటార్స్, హ్యూండాయ్ మోటార్స్‌కు అనుబంధ సంస్థ అని తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఇరు కంపెనీలు బీటా వెర్షన్ కారును విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, హ్యూండాయ్ మోటార్, యాపిల్ సంస్థలు ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా, యాపిల్ స్వయంగా 2024లో తన సొంత బ్యాటరీ టెక్నాలజీతో ప్యాసింజర్ వాహనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్టు గత నెలల్లో పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed