ఉత్కంఠకు తెర.. ఎట్టకేలకు కొండపల్లిలో అనుకున్నది సాధించిన టీడీపీ..

by  |
keshineni nani
X

దిశ, ఏపీ బ్యూరో: ఉత్కంఠం రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. హైకోర్టు ఆదేశాల నడుమ.. భారీ భద్రతతో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక జరిగింది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం వారి పేర్లను షీల్డ్ కవర్లో ఆర్వో హైకోర్టుకు సమర్పించనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబును పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అలాగే వైస్ చైర్మన్‌గా శ్రీలక్ష్మి, శ్రీనివాస్‌లను ఎంపిక చేసినట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీకి 16 మంది సభ్యుల మెజారిటీ ఉందన్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచినా శ్రీలక్ష్మీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ సభ్యులను వైసీపీ అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అనేక రకాలుగా బెదిరించింది. అయినా బెదరలేదు. చైర్మన్ కోసం అధికార పార్టీ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే తమ సభ్యులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిలబడ్డారని చెప్పుకొచ్చారు. డబ్బులకు అమ్ముడుబోయి అనేక మంది ఎమ్మెల్యే‌లు పార్టీలు మారితే.. క్యాష్‌కి లొంగకుండా క్యారెక్టర్ కోసం ధైర్యంగా నిలబడిన టీడీపీ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక అంశం కోర్టులో ఉందని చెప్పుకొచ్చారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని.. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.

వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు..

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషీయో ఓటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేశినేని నాని తన ఎక్స్ అఫిషీయో ఓటును విజయవాడ కార్పొరేషనుకు ఆప్షనుగా ఇచ్చారన్నారు. కొండపల్లిలో ఓటేయలేరనేది మా వాదన అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు.



Next Story