భక్తులతో నిండిపోయిన కొండగట్టు అంజన్న ఆలయం

by  |
భక్తులతో నిండిపోయిన కొండగట్టు అంజన్న ఆలయం
X

దిశ, మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో నిండిపోయింది. సమ్మక్క సారక్క ఉత్సవాలు సమీపించడం, సట్టిలో చివరి వారం కావడం, వారాంతపు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అంజన్న దర్శనం కోసం భక్తులు సుమారు గంటకు పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయం లోపల పరిసరాలలో అపరిశుభ్రంగా ఉండటం, చెత్త వెంట వెంటనే తొలగించకపోవడంతో భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెరుచుకున్న దుకాణలు..

దాదాపు 7 నెలల నుండి కొండపైన మూసి వేయబడిన దుకాణాలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. గతంలో దుకాణలకు టెండర్ గడువు ముగియడంతో అధికారులు షాపులను మూసివేశారు. కరోనా వైరస్ వలన నష్టపోయామని టెండర్ దారులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు దుకాణదారులకు మరో తొమ్మిది నెలల సమయం ఇచ్చినట్లు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఈఓ తెలిపారు. పూలు, పండ్లు, కిరాణం, హోటల్, కొబ్బరికాయల దుకాణాలు తెరవడంతో భక్తులుకు ఉపయోగకరంగా మారింది.

వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జాం..

వాహనదారులకు పార్కింగ్ స్థలాలు సరిపడా లేకపోవడంతో.. వై జంక్షన్ వద్ద వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పునరుద్దరణ కోసం కొండపైకి వచ్చే వాహనాలను మార్గమధ్యలోనే కొంతసేపు నిలిపివేసి విడతలవారీగా అనుమతించడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి

వాహనదారులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. గతంలో వచ్చినప్పుడు మూసి ఉన్న దుకాణాలు ఇప్పుడు తెరుచుకోవడం వలన భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రత్యేక దర్శనానికి వేరే క్యూలైన్ ఏర్పాటు చేసి సూచిక బోర్డులు పెడితే బాగుంటుంది. -రమేష్, భక్తుడు

మెరుగైన ఏర్పాట్లు చేస్తాం

గతంలో కంటే ఇప్పుడు పార్కింగ్ సమస్య కొంతమేర తగ్గింది. భక్తులకు నిరంతరం మైక్ ద్వారా సూచనలు ఇస్తూనే ఉన్నాం. సూచికలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. కమిషనర్ ఉత్తర్వుల మేరకు బకాయిలు చెల్లించిన టెండర్ దారులకు దుకాణాలు తెరచుకునేందుకు అనుమతులు ఇచ్చాము. వెంకటేష్, ఆలయ ఈఓ.

Next Story

Most Viewed