పోటీకి రెడీ అంటూనే ‘బిగ్ బాంబ్‘ పేల్చిన కొండా సురేఖ.. టెన్షన్‌లో పీసీసీ.!

by  |
Konda Surekha, revanth reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరును పరిశీలిస్తున్న క్రమంలో.. పీసీసీ ముందు ఆమె కొన్ని డిమాండ్లను ఉంచినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పరిశీలిస్తున్న అధిష్టానం కొండా కండిషన్లకు ఓకే చెప్పినట్టుగా సమాచారం. రెండు మూడు రోజుల్లో సురేఖ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కండిషన్స్ ఇవే..

హుజురాబాద్ బై పోల్స్‌లో తన పేరును ప్రకటిస్తే బరిలో నిలిచేందుకు తాను సిద్దంగానే ఉన్నానని పీసీసీ అధిష్టానం పెద్దలకు చెప్పిన కొండా సురేఖ తన లక్ష్యం మాత్రం 2023 ఎన్నికలేనని చెప్పకనే చెప్పారు. హుజురాబాద్‌లో పార్టీకి బలమైన నాయకుడు అవసరమని భావించి సురేఖ పేరును పరిశీలించింది. రానున్న జనరల్ ఎన్నికల్లో తనకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తేనే పోటీ చేసేందుకు సిద్ధమని సురేఖ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇప్పుడు హుజురాబాద్ నుంచి పోటీ చేసి నా బలాన్ని పెంచుకుంటానని, 2023 ఎన్నికల్లోనూ ఈ స్థానం తనకే ఇవ్వాలన్న ప్రతిపాదనను అధిష్టానం పెద్దల ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. జనరల్ ఎలక్షన్లలో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లను తాను చెప్పిన వారికి ఇస్తానని కూడా ఇప్పుడే హామీ ఇవ్వాలని సురేఖ తన డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్టు సమాచారం.

అయితే భూపాలపల్లి విషయంలో అధిష్టానం కొంత మీనామేషాలు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గండ్ర సత్యనారాయణ రావు పేరును పరిశీలిస్తున్నందున ఆమెను ఒప్పించే ప్రయత్నంలో కొంత మంది పెద్దలు నిమగ్నం అయినట్టుగా సమాచారం. ఇందుకు సురేఖ సమ్మతిస్తే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్, పరకాల, వరంగల్ అర్బన్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయం అమెకే వదిలేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ మూడు నియోజకవర్గాలు అనుసంధానంగా ఉంటాయని, దీనివల్ల 2023 ఎన్నికల్లో కాంగ్రెస్, కొండా వర్గానికి ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని సురేఖ ముందు ఉంచినట్టు తెలుస్తోంది.

పీసీసీ మదిలో..

హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారు. ఓ వైపున కొండా మురళీ, మరో వైపున సురేఖల సామాజిక వర్గాల వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతారని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

అంతే కాకుండా టీఆర్ఎస్, ఈటల వ్యతిరేక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే కొండా సురేఖ లాంటి బలమైన నాయకురాలు ఉంటే పార్టీకి మరింత లాభిస్తుందని కూడా భావిస్తున్నారు. ముఖ్య నాయకులు లేకున్నా కాంగ్రెస్ పార్టీకి 10 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్టుగా నిఘా వర్గాలు, సర్వేలు తేల్చి చెప్తున్నందున సురేఖను పోటీలో నిలిపితే అన్నింటా లాభం చేకూరుతుందని పీసీసీ నాయకులు లెక్కలు వేస్తున్నారు.

అయితే అలా..

అటు ఈటల, ఇటు టీఆర్ఎస్, మరో వైపున కాంగ్రెస్ ఓటు బ్యాంకు వల్ల జాక్ పాట్ కొట్టే అవకాశాలు లేకపోలేదని కూడా భావిస్తున్నారు. లేనట్టయితే వచ్చే ఎన్నికల నాటికీ బలమైన క్యాండెట్‌గా సురేఖ హుజురాబాద్‌లో తయారు కానున్నారని కూడా అనుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా అక్కడ గెలిచే అభ్యర్థుల తలరాతలను మార్చే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా కొండా సురేఖ అభ్యర్థిత్వం వల్ల ఎక్కువ నష్టం అధికార టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని కూడా పీసీసీకీ రోల్ లీడర్స్ స్కెచ్ వేసుకుంటున్నారు.

Next Story