కొండా ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

by  |
కొండా ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళీధర్ రావు ఫోకస్ పెట్టారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన ఆయన కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు డివిజన్ల వారీగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

పూర్వ వైభవం కోసం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆశీస్సులతో 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విధంగా కొండా మురళీధర్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేఖకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు.

ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీని వీడి సొంతగూటికి చేరుకున్నారు. ఆనాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్య నాయకులు, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అసంతృప్తులకు గాలం..?

అప్పట్లో కొండా దంపతులు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. గత ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో తిరిగి కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరడంతో అనుచరగణమంతా వారిని అనుసరించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది టీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కొండా దంపతుల ముద్ర ఉన్న నాయకులు, కార్యకర్తలకు సరైన ప్రాతినిధ్యం లేనందున వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కొండా దంపతుల పిలుపు మేరకు పార్టీలో చేరారు. కొద్ది రో జుల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

టీఆర్‌ఎస్‌లో పోటీ..

అధికార టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. 58 డివిజన్లకు గానూ ఒక్కో డివిజన్ నుంచి నలుగురికి పైగా పోటీ పడుతున్నారు. కొంతమంది నాయకులు ఈ సారి ఎలాగైనా పోటీలో ఉండాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాంటి నాయకులను తమ వైపు తిప్పుకుని బరిలో నిలపాలని కొండా దంపతులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఉన్న సంబంధాల కారణంగా వారితో టచ్‌లో ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను వినియోగించుకుని కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కొండా దంపతులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.


Next Story

Most Viewed