అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

by  |
mallanna
X

దిశ, కొమురవెల్లి: కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. శివ భక్తులు శివాలెత్తి పోయారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న లోకకళ్యాణార్థం పెళ్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మల్లన్న కల్యాణోత్సవానికై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పళ్లెంలో నెత్తిన పెట్టుకుని సాంప్రదాయ బద్దంగా మేళ, తాళాలతో వచ్చి సమర్పించారు. బృహన్ మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా… వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు, స్థానిక జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, హుజురాబాద్ MLA ఈటల రాజేందర్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్,ఈఓ బాలాజీ, ఆలయ చైర్మన్ గిస భిక్షపతి, ధర్మకర్తలు, సర్పంచ్ సార్ల లత, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీటీసీలు లింగంపల్లి కవిత కొయ్యడ రాజమణి, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ వాసల సతీష్, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ చంద్రమౌళి యాదవ్ 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.


Next Story

Most Viewed