కోమటిరెడ్డి దీక్షకు దిగొచ్చిన యంత్రాంగం

by  |
కోమటిరెడ్డి దీక్షకు దిగొచ్చిన యంత్రాంగం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్ మార్కెట్ యార్డులో దీక్షకు దిగారు. దాదాపు ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. మార్కెట్ యార్డులోనే ఎంపీ వెంకటరెడ్డి రైతులతో కలిసి దీక్షకు దిగారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం రైతుల నుంచి 15 రోజులైనా ధాన్యం సేకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికార యంత్రాంగం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ధాన్యం పూర్తిస్థాయిలో కొంటామని స్పష్టం చేసింది. వ‌డ్లు కొనుగోలు జ‌రిగే వ‌ర‌కు దీక్ష చేస్తాన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెట‌రీ ఫోన్‌లో మాట్లాడారు. అలాగే న‌ల్లగొండ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్, వ్య‌వ‌సాయ శాఖ‌ ఉన్న‌తాధికారులు నేరుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ప్ర‌తి రోజు 10వేల బ‌స్తాల ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌కిరేక‌ల్ మార్కెట్ యార్డులో దీక్ష‌ను విర‌మించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలులో స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. వారంలో న‌ల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోతే అమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగితాన‌ని స్ప‌ష్టం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుప‌డ‌దని అలాంటిది నేడు రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తి రైతు చేత క‌న్నీరు పెట్టిస్తున్నార‌ని దుయ్య‌బ‌బ్టారు. త‌డిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి ష‌ర‌తులు లేకుండా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల యార్డ్‌కు తెచ్చిన ధాన్యం వ‌ర్షానికి త‌డిసింద‌న్నారు. ప్ర‌భుత్వం కొనుగోలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో రైతులు ద‌ళారుల‌కు అమ్ముకుని న‌ష్టాల్లోకి వెళుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.



Next Story